ఏనాడన్నా నియోజకవర్గాన్ని పట్టించుకున్నడా..?
అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి ఎజెండా
గెల్లు శ్రీనును గెలిపించి అసెంబ్లీకి పంపండి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
కమలాపూర్ మండలంలో ప్రచారం
కమలాపూర్/ కమలాపూర్ రూరల్, అక్టోబర్ 6 : 2004లో వ్యాపారం చేస్తూ అనామకుడిగా ఉన్న ఈటల రాజేందర్ను కేసీఆర్ చేరదీసి పెద్దోన్ని చేసిండు. ఎమ్మెల్యే, మంత్రిగా ఎన్నో పదవులు ఇచ్చి ఆత్మగౌరవం పెంచిండు. కానీ, ఆయనకు మాత్రం అక్రమాస్తులు సంపాదించడమే ఆత్మగౌరవం. అధికారం ఇస్తే అందిన కాడికి దోచిండు. దోచింది కాపాడుకునేందుకు బీజేపీలో చేరిండు. పెద్ద చేసిన కేసీఆర్కే వెన్నుపోటు పొడిచేందుకు కుట్ర పన్నిండు. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నడు. మన రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకమూ బీజేపీ రాష్ర్టాల్లో లేదు. దీనిపై ఈటల మాట్లాడుతడా..? ధరలు పెంచుతున్న కేంద్రాన్ని నిలదీస్తడా..? సామాన్యులకు ఏ సమాధానం చెప్తడు? హుజూరాబాద్ ప్రజలు మీరే ఆలోచించాలె. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలె. మీ కండ్ల ముందు పెరిగిన బిడ్డను దీవించాలె.
అనామకుడిగా ఉన్న ఈటల రాజేందర్ను ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు ఇచ్చి పెద్దోన్ని చేసిన సీఎం కేసీఆర్పైనే కుట్రలు చేసిండని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. అక్రమంగా సంపాదించడమే ఈటల ఆత్మగౌరవమా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచాయని చెప్పారు. కమలాపూర్ మండలంలోని గూనిపర్తి, శ్రీరాంలపల్లి, అంబాల గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల వినోద్ మాట్లాడారు. రాజకీయ భిక్షపెట్టిన కేసీఆర్కే గోరి కడుతాననడం ఈటలకు తగునా? అని ప్రశ్నించారు. ప్రజలకు బీజేపీ చేసిందేమి లేదని, మన రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకమూ ఇతర రాష్ర్టాల్లో లేవని స్పష్టం చేశారు. దీనిపై ఈటల మాట్లాడగలడా? అని ప్రశ్నించారు. గులాబీకి వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించిన ఎందరో నాయకులు కాలగర్భంలో కలిసిపోయారని, రానున్న రోజుల్లో ఈటలకు అదే గతి పడుతుందని విమర్శించారు. పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
సేవ చేయడం చేతకాకే ఈటల రాజీనామా:గెల్లు శ్రీనివాస్ యాదవ్
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేయడం చేతకాక ఈటల రాజీనామా చేసిండని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, విపక్షంలో గెలిచి ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఇతర మంత్రులు తమ నియోజకవర్గాల్లో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తే, ఈటల రాజేందర్ ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై బీజేపీ భారం వేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ యాజమాన్యాలకు అమ్ముతున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు లక్షా 30వేల ప్రభుత్వోద్యోగాలను టీఆర్ఎస్ సర్కారు భర్తీ చేసిందని, రాబోయే రోజుల్లో మరో 80వేల వరకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పారు. తనను గెలిపిస్తే ఇండ్లు లేని వారికి ఐదు వేల ఇండ్లను నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి మెడికల్ కళాశాలను మంజూరు చేసే విధంగా సీఎం కేసీఆర్తో మాట్లాడుతానన్నారు.
కార్పొరేట్ సంస్థలకే బీజేపీ భరోసా:పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కార్పొరేట్ సంస్థలకే బీజేపీ భరోసానిస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధ్వజమెత్తారు. పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకోవడమే ఆ పార్టీ ఎజెండా అని విమర్శించారు. నియోజకవర్గానికి ఈటల ఏం చేయలేదని సొంతంగా ఆస్తులు సంపాదించుకోవడానికే పదవులను అడ్డుపెట్టుకున్నాడని విమర్శించారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కడారి సాంబయ్య, కంచనకుంట్ల విజేందర్రెడ్డి, మండల ఇన్చార్జి డాక్టర్ పేరియాల రవీందర్రావు, ఎంపీటీసీ గుర్రం వెంకటేశ్వర్లు, ఓసీ సంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు పొలాడి రామారావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, డైరెక్టర్ తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, ఉపసర్పంచ్ మనోజ్, నాయకులు పింగిళి ప్రదీప్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.