రైతులకు సూచించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్
వేరుశనగ, మక్కజొన్న పంటల పరిశీలన
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్5: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ రైతులకు సూచించారు. ఆదివారం నుస్తులాపూర్ గ్రామంలో పల్లి పంటను పరిశీలించి నుస్తులాపూర్ క్లస్టర్ పరిధిలోని రైతులతో మాట్లాడారు. యాసంగిలో వరికి బదులు నూనె గింజలు, ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగు కోసం డ్రిప్, స్పింక్లర్లు సబ్సిడీపై అందజేయాలని కలెక్టర్ను కోరారు. స్పందించిన ఆయన ప్రభుత్వ పరంగా అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఏడీఏ శ్రీనివాస్, ఏవో సురేందర్, డీటీ రమేశ్, ఏఈవో స్వామి, సర్పంచులు కాటిక వినోద, మీసాల అంజయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇతర పంటలపై దృష్టి సారించాలి
రైతులు వరికి స్వస్తి పలికి ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఆదివారం గుండ్లపల్లి గ్రామంలో రైతు చాడ సత్యనారాయణరెడ్డి సాగు చేస్తున్న పల్లి, జొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వేరుశనగ పంట దిగుబడి, పెట్టుబడి వివరాలను అడిగి తెలుసుకొన్నాడు. ఎకరానికి రూ. 5 వేల పెట్టుబడి అవుతుందని, పది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతు తెలిపాడు. క్వింటాలుకు రూ.15,000 ధర వస్తుందని వెల్లడించారు. ఇతర పంటల సాగులో ఉన్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించగా డిమాండ్ ఉన్న పంటల సాగుకు కృషి చేయాలని రైతులకు సూచించారు. మండలంలో ఇతర పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్న వ్యవసాయాధికారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్, జిల్లా ఆర్బీఎస్ కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, ఏడీఏ శ్రీనివాస్, తహసీల్దార్ బండి రాజేశ్వరి, ఏవో కిరణ్మయి, సర్పంచ్ బేతెల్లి సమతారాజేందర్రెడ్డి,ఉప సర్పంచ్ చింతల పద్మాపరశురాములు, ఏఈవో నరేశ్, రైతులు వంగల నర్సింహారెడ్డి, చాడ తిరుపతిరెడ్డి, చింతల రవి పాల్గొన్నారు.