తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 5: పెద్ద,పెద్ద పట్టణాలు.. అద్దాల కాలేజీలు.. కార్పొరేట్ హంగులతో ఉన్న కాలేజీలు కావివి. కార్పొరేట్ స్కూల్స్లో చదివిన బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులు కారు వీరు. కానీ.. ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తవగానే కార్పొరేట్ కంపెనీల్లో కొలువులు సాధిస్తున్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు. కార్పొరేట్ కంపెనీలు కరీంనగర్ జిల్లాకు రిక్రూట్మెంట్ కోసం తరలివస్తున్నారు. అందులో తిమ్మాపూర్ మండలంలో ఉన్న కాలేజీలకు కంపెనీలు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నాయి.
మండలంలో వాగేశ్వరి, జ్యోతిష్మతి, శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో వందల సంఖ్యలో విద్యార్థులు ప్రతి ఏడాదీ పలు కంపెనీల్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ కాలేజీలన్నీ కూడా పచ్చని ప్రకృతి ఒడిలో ఉంటూ విద్యార్థులకు స్వేచ్ఛాయుత చదువునందిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులు పచ్చని ప్రకృతి ఒడిలో విద్యనభ్యసిస్తూ కార్పొరేట్ ఆఫీస్లుల్లో కొలువులు సాధిస్తున్నారు.
చిన్న, పెద్ద కంపెనీలు..
వాగేశ్వరీ, జ్యోతిష్మతి, శ్రీ చైతన్య కళాశాలల్లో నిర్వహించే రిక్రూట్మెంట్ డ్రైవ్లో చిన్నా..పెద్ద అనే తేడా లేకుండా కంపెనీలు పెద్ద ఎత్తున డ్రైవ్ నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. టాస్క్ ఆధ్వర్యంలో ఎక్కువగా రిక్రూట్మెంట్ డ్రైవ్లు జరుగుతున్నాయి. వాటితో పాటు కాలేజీల ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ల కోసం ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కాలేజీల ప్రతినిధులు వివిధ కంపెనీలతో నిత్యం టచ్లో ఉంటూ తమ కాలేజీలకు కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. టీసీఎస్, విప్రో, ఎంపోసియెస్, హెచ్సీఎల్ తదితర కంపెనీలు ఎక్కువగా డ్రైవ్ల కోసం వస్తున్నాయి.
మంచి జీతం..తప్పుతున్న అదనపు ఖర్చు
గతంలో ఇంజినీరింగ్ పూర్తవగానే సాఫ్ట్వేర్ జాబ్ కావాలనుకునేవారు హైదరాబాద్ బాట పట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల వెంట పడేవారు. ఏవేవో కోర్సులు నేర్చుకుంటూ టైంతో పాటు, డబ్బు వృథా చేసేవారు. ప్రస్తుతం విద్యార్థులకు అలాంటి తిప్పలేవీ లేకుండానే డైరెక్ట్గా కంపెనీలో జాబ్కు రిక్రూట్ అవుతున్నారు. ఎలాంటి అదనపు ఖర్చు పెట్టకుండానే.. విద్యార్థులు మంచి జీతం పొందుతున్నారు. ఒక్కో విద్యార్థి బీటెక్ పూర్తి చేసేలోపే రూ.3 లక్షల నుంచి 6లక్షల వరకు వార్షిక వేతనం పొందుతున్నారు. ఒక్కో కాలేజీ నుంచి ఏదో ఒక కంపెనీలో వంద మందికి తక్కువ కాకుండా రిక్రూట్ అవుతున్నారు.
ప్రతిభ, కష్టపడే తత్వం..
ఈ కళాశాలల్లో ఎక్కువగా చదువుకునేది ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులే. చాలా వరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులే కావడం, వారిలో ప్రతిభతో పాటూ పనిలో సిన్సిరియారిటీ.. కష్టపడేతత్వం ఉండడంతో ఒకసారి వచ్చిన కంపెనీలు మళ్లీ వచ్చి ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. ప్రతిభ చాటుతున్న ఫ్రెషర్స్ను తీసుకుని వారికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నాయి.