కరీంనగర్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయం అంటే ఇప్పుడు వరి లేదా పత్తి అనుకునే రోజులు వచ్చాయి. సాగు నీటి లభ్యత, వ్యవసాయ రంగంలో పెరిగిన మౌలిక సదుపాయాల కారణంగా సులభతరమైన పంటల సాగుకే రైతులు అలవాటు పడ్డారు. ఫలితంగా ఇతర పంటల ఉత్పత్తులు తగ్గిపోయి వాటికి మార్కెట్లో డిమాండ్ పెరిగి పోయింది. ఈ నేపథ్యంలో అసలు వ్యవసాయం అంటే ఏమిటి?, ఎనకట మన రైతులు వాళ్ల క్షేత్రాల్లో ఎలాంటి పంటలు వేసేవాళ్లు. నాటితరం రైతులు ఇప్పుడు ఏమంటున్నారు. ఏ ఊరి పంట ఆ ఊరికే అన్న సామాజిక స్ఫూర్తి ఏమైంది.. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనబోమని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో నాటి పంటలవైపు రైతన్నలు దృష్టి మళ్లించాల్సిన అవసరం ఎంత మేరకు ఉందనే విషయాలపై ప్రత్యేక కథనం.
యాభై ఏండ్ల కింద ఎంత చిన్న కమతం ఉన్న రైతైనా తన క్షేత్రంలో తీరొక్క పంట సాగు చేసుకునేది. ఒక పక్క పప్పు దినుసుల కోసం కంది, పెసర, బబ్బెర, శనగ, ఉలువలు, మినుములు, మరో పక్క నూనె గింజల కోసం పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలు, కుసుమ, ఆముదం, బలవర్థకమైన ఆహారం కోసం మక్క, జొన్న, రాగులు, మరో పక్క ఇంటికి సరిపడా కూరగాయలు పండించే వాళ్లు. రైతులు తమ క్షేత్రాల్లో 50 శాతం భూమిలో ఇతర పంటలు సాగు చేసి మిగతా 50 శాతం భూమిలో వరి పండించేది. మెట్ట ప్రాంతాల్లో అయితే వరి సాగు ఉండేదే కాదు. ఆరుతడి పంటలు వేసుకుని కష్టాన్ని నమ్ముకుని పంటలు తీసే వాళ్లు. అప్పట్లో వరి దిగుబడి అతి తక్కువగా ఉండేది. ఎకరం సాగు చేస్తే 8 నుంచి 10 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చేది. దీంతో రైతులు వరి పంట సాగుకు ఎక్కువ మొగ్గు చూపేవారు కాదు. నీటి లభ్యతను బట్టి వరి సాగు చేసుకోవడం, మిగతా క్షేత్రంలో ఇతర పంటలు వేసుకుని చీకూ చింతా లేకుండా వ్యవసాయం చేసుకునేవారు. పండిన పంటలో రైతు ఇంటి అవసరాలకు దిగుబడులు ఉంచుకుని మిగతావి మాత్రమే అమ్ముకునేవారు. కూలీలకు కూడా వ్యవసాయ దినుసులనే కూలీ కింద చెల్లించేవారు. ఏ ఊరికి అవసరాలకు సరిపడా పంటలు ఆ ఊరిలో సాగు చేసుకునేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాటి రైతులు ఎంతో సుఖంగా జీవించే వారు.
ఇతర పంటల సాగు చేస్తేనే లాభం..
వరి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఏటా రెండు సీజన్లు వరి సాగు చేయడం వలన అవసరానికి మించి దిగుబడులు వస్తున్నాయి. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో కొనలేమని చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఎనకటి మాదిరిగానే ప్రతి రైతు క్షేత్రంలో తీరొక్క పంట సాగుచేసుకునేలా ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయడం రైతులకు మేలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఒక్కో రైతు క్షేత్రంలో ఇతర పంటలైన పల్లి, శనగ, మక్కతోపాటు అపరాలు సాగు చేసే విధంగా జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. రైతులు కూడా నాటి కాలాన్ని గుర్తు చేసుకుని తమ క్షేత్రాల్లో అన్ని పంటలు సాగు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు.
ఇప్పుడంతా కమర్షియల్ పంటలే..
ఎనకటితో పోల్చుకుంటే ఇప్పటి వ్యవసాయం అంతా కమర్షియల్ అయిపోయిందనే భావన కలుగుతోంది. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, పెరిగిన మౌలిక సదుపాయాల కారణంగా ప్రతి రైతు వరి లేదంటే పత్తి పంటలే సాగు చేసే పరిస్థితి వచ్చింది. దీంతో ఇతర పంటలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వరి, పత్తి పంటల సాగు రైతులకు సులభతరంగా మారాయి. నీటి లభ్యత పెరుగడంతో ఈ రెండు పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ కారణంగా పప్పు దినుసులు, నూనె గింజలు, ఇతర పంట దిగుబడులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వీటిలో కొన్ని పంటల దిగుబడులు కంటికి బంగారమైపోయాయని అంటున్నారు ఒకప్పుడు తీరొక్క పంట పండించిన రైతులు. పంట మార్పిడి పాటించకుండా వరి, పత్తి పంటలు మాత్రమే సాగు చేయడం, అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడడంవల్ల నేలలు కూడా నిస్సారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నేలలు పూర్తిగా పనికి రాకుండా పోతాయని వ్యవసాయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
అప్పటి ఎవుసమే బర్కతి
ఎనగటి కాలంలనే ఎవుసం బాగుండేది. కానీ, ఇన్నేండ్లు వరి సాగు చేసినా ఫలితం లేదు. నాకు 12 ఎకరాల ఎవుసం భూమి ఉంది. ఒకప్పుడు పశువుల పెంట బాగా పోసి పండిస్తే మంచి పంటలు పండేవి. ఎంతో బర్కతి ఉండేది. మక్క, పెసర, జొన్న, ఇంక వేరే పంటలు పండించెటోళ్లం. మందులు మాకులు వేసేటోన్ని కాదు. వరి పండిస్తే ఏం లాభం లేదు. ట్రాక్టర్ దున్నడానికి, అడుగు మందులకు, పురుగు మందులకు, నాటేసేటోళ్లకు, వరి కోసే మిషిన్కు.. ఇట్ల శానా ఖర్సైతంది. లాగోడే మిగుల్తలేదు. ఎనకటి లెక్కల పంటలు పండిస్తేనే లాభం ఉంటది. రైతు బాగుపడ్తడు.
మేలుకోకపోతే ప్రమాదమే..
నేను 1968లో వ్యవసాయ అధికారిగా ఉద్యోగంలో చేరినప్పుడు జిల్లాలో మెట్ట ప్రాంతమే ఎక్కువ. అప్పట్లో సేంద్రియ పద్ధతుల్లో నేల సారాన్ని పెంచి వ్యవసాయం చేసేవాళ్లు. చెరువుల కింద ఒక్క వానకాలం మాత్రమే వరి సాగు చేసేటోళ్లు. యాసంగి సీజన్ల వరి జోలికి వెళ్లేవాళ్లు కాదు. ప్రతి రైతు క్షేత్రంలో నవ ధాన్యాల పంటలు కనిపించేవి. కూలీలకు కూడా దినుసులే కూలి కింద ఇచ్చేది. ఇలా ఏ ఊరిలో వేసిన పంట ఆ ఊరి అవసరాలకు సరిపోయేది. ఇప్పుడు రైతులు శ్రమలేని వ్యవసాయానికి అలవాటు పడడంతో వరి, పత్తి వంటి పంటలు ఎక్కువ సాగవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి మనం మేలుకోకపోతే రేపటి సమాజానికి చేటు జరిగే ప్రమాదం ఉంది.
ఇంటోళ్లమంతా కలిసి పన్జేసేది
గప్పటి ఎవుసం వేరు.. ఇప్పటిది వేరు. అప్పుడు ఇంటోళ్లందరం కలిసి పన్జేసేటోళ్లం. అడవిజంతువుల బెడద లేకుండే.. మాకు అవసరమైన పంటలే వేసోటోళ్లం. అపుడు కరంటు ఎక్కడిది. యాతమేసి నీళ్లు పారిచ్చేటోళ్లం. ఇప్పుడు ఎవుసం సుఖమైంది. అలుకగా ఉంటదని వరి వేస్తున్నరు. అన్ని రకాల పంటలు పండించాలె.