హనుమకొండ చౌరస్తా : పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో కేయూ గేట్ వద్ద పోస్టర్లు ఆవిష్కరించారు. ఈనెల 28న నారాయణగూడలోని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నివాసం ( CMs Residence ) వరకు భారీ పాదయాత్ర (AISF Padayatra ) నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి ప్రణీత్గౌడ్, జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. వేలాది మంది విద్యార్థులకు రావాల్సిన ఆర్థిక సహాయం సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఫీజు బకాయిల కారణంగా అనేక కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, దీంతో పైచదువులు, ఉద్యోగావకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 31 జిల్లాల నుంచి విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భానుప్రసాద్, శ్రీపతి వినయ్, కేయూ అధ్యక్షుడు కొమ్ము సాయి, కార్యదర్శి నితిన్, నాయకులు రమ్య, ప్రవళిక పాల్గొన్నారు.