జాతీయ అధ్యక్షుడు అన్న విషయమే మరిచిపోయారు
చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మతి తప్పి మాట్లాడుతున్నారని, ఆయన ఒక జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అన్న విషయమే మరిచి గల్లీ లీడర్లా ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమే చెబుతున్నదని, అదే పని చట్టం చేస్తోంటే తిరిగి విమర్శిస్తున్నది వారేనని మండిపడ్డారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. అనేక రంగాల్లో తెలంగాణ దేశానికి ఒక దిక్సూచిగా నిలుస్తున్నది. ఈ విషయాన్ని గతంలో రాష్ర్టానికి వచ్చిన అనేక మంది కేంద్రమంత్రులు కితాబిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టింది కేంద్రం. నల్ల చట్టాలను తెచ్చి రైతుల గొంతు నొక్కాలని చూసింది కేంద్రం. ధాన్యం కొనుగోలు విషయంలో హామీ ఇవ్వకుండా మోసం చేస్తున్నది కేంద్రం. కానీ, అన్నదాతకు అండగా నిలుస్తూ.. రైతు వ్యతిరేక చట్టాలతోపాటు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును బాహాటంగా ఎండగట్టడమే కాదు, ఏకంగా కేద్రంపై పోరాటాన్నే ప్రకటించిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవన్నీ జేపీ నడ్డాకు నచ్చడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. అందుకే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిందని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై గతంలోనే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరిరారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే నిరూపించాలన్నారు. కానీ, అది చేతకాలే. ఇప్పుడొచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కేంద్రం ఏటా ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయాన్ని రెటింపు చేస్తామన్న హామీలు గాలిలో కలిసిపోయాయి. నల్లధనం వెలికి తీసి ప్రతి ఒక్కరీ బ్యాంకు ఖాతాల్లో లక్షలు వేస్తామన్న మాటలు మచ్చుకైనా కనిపించడం లేదు. అంతేకాదు, బీజేపీ హయాంలో ఏమి చేశారంటే ఏ ఒక్కరు చెప్పరు. నడ్డా ఇకనైనా తన తీరు మార్చుకోవాలి. ముఖ్యమంత్రిపై విమర్శలు మానుకోవాలి.