హుజూరాబాద్టౌన్, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కోరుతూ బుధవారం హుజూరాబాద్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో కార్మికులు హ్యాండ్లూమ్ మార్చ్ ర్యాలీ తీసి ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పోలీస్స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చిన కార్మికులను టౌన్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎలిగేటి ఉపేందర్, వేముల యాదగిరి, కోశాధికారి గుండేటి మహాదేవ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీరో జీఎస్టీని ప్రకటించాలన్నారు. చేనేతపై విధించిన జీఎస్టీతో ఎందరో నేత కార్మికులకు జీవనోపాధి కరువవుతుందన్నారు. పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించారన్నారు. ఇక్కడ చేనేత సహకార సంఘం డైరెక్టర్లు, కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.
వీణవంక, జనవరి 5: చేనేత సహకార సంఘాలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని సొసైటీ చైర్మన్, ఆప్కో డైరెక్టర్ అడిగొప్పుల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని కోర్కల్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో జీఎస్టీని పూర్తిగా తీసివేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీని ఎత్తివేయని పక్షంలో చేనేత కార్మికులందరూ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు ఆరుగొండ మనోహర్, కోశాధికారి పరికి సదానందం, డైరెక్టర్లు ఆరుగొండ లస్మయ్య, సింగం మల్లయ్య, చంద్రయ్య, దాసరి సుశీల, చంద్రాచారి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న చేనేత నాయకులు, కార్మికుల ఆందోళన కొనసాగుతున్నది. బుధవారం జమ్మికుంట పట్టణంలోని షత్రంజి చేనేత సంఘం అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో ‘చేనేతపై జీరో జీఎస్టీ కోసం హైండ్లూమ్ మార్చ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ తీసి, తహసీల్దార్ రాజారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇక్కడ సంఘం నాయకులు, సభ్యులు, కార్మికులున్నారు.