మూడో రోజూ వారోత్సవాలు
పెద్దపల్లిలో పత్తి రైతులకు సన్మానం
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు
నమస్తే నెట్వర్క్, జనవరి 5(నమస్తే తెలంగాణ) :కర్షకలోకం మురిసిపోతున్నది. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ఊరూరా వేడుకలతో హోరెత్తిస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి వ్యవసాయ క్షేత్రాలు, పురవీధుల్లో పండుగ జరుపుకుంటున్నది. వేడుకలను పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘జై కేసీఆర్.. ఇంటింటా రైతుబంధు’ అంటూ పంట ఉత్పత్తులతో తీర్చిదిద్దుతూ.. రంగ వల్లులు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నది. మరోవైపు అధికార యంత్రాంగం పాఠశాలల్లో ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులు అందజేయడంతో పాటు పలువురు ఉత్తమ రైతులను సన్మానించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుబంధు వారోత్సవ సంబురాలు మూడో రోజూ ఉత్సాహంగా కొనసాగాయి. శంకరపట్నం మండలం కేశవపట్నంలోని ఓ పొలంలో రైతులు వరి నారుతో రైతుబంధు ఆకృతిని తీర్చిదిద్దారు. గంగాధర మండలం రంగరావుపల్లి, సర్వారెడ్డిపల్లి, నాగిరెడ్డిపూర్, ఒద్యారంలో రైతుబంధు అవశ్యకతపై ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏడీఏ దోమ ఆదిరెడ్డి, ఇతర వ్యవసాయశాఖ అధికారులు రైతులకు మిఠాయి పంచిపెట్టారు. ఓదెల మండలం బాయమ్మపల్లిలో ఓ వ్యవసాయక్షేత్రంలో రైతులు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు, కమాన్పూర్ మండలం రొంపికుంటలో ఆర్బీఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఇక మంథని వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో అధికారులు రంగువల్లులతో రైతు బంధు అని రాసి సంబురాలు జరుపుకున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నలుగురు రైతులను శాలువాలతో సత్కరించారు.
కేసీఆర్ అక్షరాల ఆకృతిని తెల్ల బంగారం (పత్తి)తో పోతపోసి రైతులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య రైతులతో కలిసి రైతు వేదిక ప్రాంగణంలోని వ్యవసాయ పొలంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎడ్ల బండితో గ్రామంలో కలియ తిరిగారు. గంభీరావుపేట మండలం నర్మాల గురుకుల పాఠశాలలో రైతు బంధుపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో రైతు బంధు అక్షరాల రూపంలో కూర్చున్నారు. ముస్తాబాద్ మండలం బంధనకల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీపీ జనగామ శరత్రావు, నాయకులు, రైతులు కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన ఉన్నత పాఠశాలలో రైతుబంధు అంశాలు, వ్యవసాయం ప్రాముఖ్యతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కోరుట్ల మండలం వెంకటాపూర్లో ఎంపీపీ తోట నారాయణ, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలువురు మహిళా రైతులు తమ ఇండ్ల ముందు రైతు నాగలి, ఎడ్ల జోడి ఉన్న ముగ్గులు వేసి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామం ఎంపీటీసీ పన్నాల లావణ్య ఇంటి వద్ద ‘రైతుబంధు’ పేరిట ముగ్గు వేసి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.