ఏడీఆర్ డాక్టర్ ఉమాదేవి
పొలాసలో ప్రపంచ నేల దినోత్సవం
జగిత్యాల టౌన్, డిసెంబర్ 4 : రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వేయకుండా, సేంద్రియ సాగు చేసి భూసారాన్ని కాపాడుకోవాలని పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్ ఉమాదేవి సూచించారు. పొలాస పరిశోధనా స్థానంలో శనివారం ప్రపంచ నేల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం దెబ్బతింటుందని, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. భూసార పరీక్షలు చేయించి ఎరువులను వాడడంతో పాటు ఆరుతడి పంటలైన పప్పు జాతి పంటలను సాగు చేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. పంట సాగుకు ముందు పచ్చిరొట్టను సాగు చేస్తే నేలలో సేంద్రియ పదార్థం తయారవుతుందని తెలిపారు. కొయ్యకాలును కాల్చడం, ఎరువులు అధిక మోతాదులో వాడడంతో నేలలో ఉన్న జీవన ఎరువులు చనిపోయి పంటకు నష్టం వాటిల్లుతుందన్నారు. కొయ్యకాలును మల్చర్ యంత్రం ద్వారా భూమిలోనే దున్నడం ద్వారా 16 రకాల పోషకాలు భూమిలో నిల్వ ఉంటాయన్నారు. పంట మార్పిడి, సేంద్రియ ఎరువులు వాడాలన్నారు. అడిషనల్ డీఆర్డీవో సుధీర్కుమార్ మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ భూసారాన్ని పరీక్షించుకోవాలన్నారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే సుకుమార్ మాట్లాడుతూ అధిక మోతాదులో రసాయనిక ఎరువులను రైతులు వాడుతున్నారని, రానున్న రోజుల్లో నేలపై దుష్ప్రభావాలను చూపిస్తాయన్నారు.
డాక్టర్ ఎ.ఉమారాజశేఖర్ జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి వివరించారు. డాక్టర్ ఎ.కృష్ణచైతన్య వివిధ పంటల్లో ఏర్పడే పోషక లోపాల గురించి, వాటి సవరణ గురించి రైతులకు తెలిపారు. డాక్టర్ పీ రవి సమస్యాత్మాక నేలల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, ఎరువుల మోతాదు, పంట దిగుబడిపై ప్రభావం గురించి రైతులకు వివరించారు. డాక్టర్ చంద్రశేఖర్ యాజమాన్య పద్ధతులను వివరించారు. అనంతరం వ్యవసాయ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. దత్తత గ్రామాల్లో ఆదర్శంగా పంటలు పండిస్తున్న జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన రామకిషన్, రాయికల్ మండలం ఆరెపెల్లికి చెందిన దుర్గం రాజన్న, కోరుట్ల మండలం జోగినిపల్లికి చెందిన బద్దం దేవారెడ్డిని శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. రైతులు భూసారాన్ని కాపాడుకోవడానికి శాస్త్రవేత్తలు తయారు చేసిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులతో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ను రైతులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో దత్తత గ్రామ వెల్దుర్తి సర్పంచ్ ప్రవీణ్గౌడ్, శాస్త్రవేత్తలు, వివిధ గ్రామాల రైతులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు.