మంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్ మండలంలో పర్యటన
పడకల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభం
వెల్గటూర్, ఆగస్టు 4: అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం సమ న్యాయం చేస్తున్నదని, వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. వెల్గటూర్ మండలంలోని పడకల్, కొత్తపేట గ్రామాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. పడకల్లో రూ.75లక్షల విలువైన అభివృద్ధి పనులు, 15 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. కొత్తపేటలో రైతు వేదికను ప్రారంభించి ఎస్సీ కాలనీలో పర్యటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పడకల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుని అన్ని విధాలా అభివృద్ధి చెంది జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవడం అభినందనీయమన్నారు. అన్ని కుల వృత్తుల వారిని ఆదుకొంటున్నది మన ప్రభుత్వమేనన్నారు. ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయం దండుగ అన్న వారికి అది పండుగ అని నిరూపిస్తూ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగామని పేర్కొన్నారు. దళిత బంధుతో అణగారిన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు నింపేలా దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రూపొందించారన్నారు. ఈ నెల 16న ఈ కార్యక్రమాన్ని హుజూరాబాద్లో ప్రాంభించి త్వరలో రాష్ట్రమంతటా అమలు చేస్తామని చెప్పారు. ‘
మీకు పరిపాలన చేసుకోరాదు, ప్రాజెక్టులు నిర్మించుకోలేరు’ అని మనల్ని ఎగతాళి చేసిన వారి ముందు అనతి కాలంలోనే ప్రాజెక్టులు నిర్మించుకొని దేశం గర్వించే విధంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఉద్ఘాటించారు. రైతు వేదికలు రైతులకు విద్యాలయాలుగా మారి వారిని విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అనంతరం కప్పారావుపేటకు చెందిన మ్యాకల రాజలింగయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రైతు బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, సర్పంచ్ కొమ్ము రాంబాబు, కంది లావణ్య, గెల్లు శేఖర్, రైతు బందు సమితి మండల కోఆర్డినేటర్ చుక్క శంకర్రావు, ఏఎంసీ చైర్మన్ ఏలేటి కృష్ణరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గూడ రాంరెడ్డి, ఎంపీటీసీ నక్క పూజిత, మాజీ ఎంపీటీసీ కోడి గంగయ్య, ఏడి రాంచందర్, ఏవో కరుణ, మండలాధ్యక్షుడు చల్లూరి రాంచందర్ గౌడ్, నాయకులు సింహాచలం జగన్, రామడుగు రాజేశ్, కంది విష్ణు మూర్తి, మూగల సత్యం, కొప్పుల సురేశ్, మహేందర్రెడ్డి, శ్రీనివాస్, రాజేశ్వర్రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.