ఓదెల, అక్టోబర్ 2: అవయవదానం పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సదాశయ ఫౌండేషన్ సేవలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్రెడ్డి కొనియాడారు. ఓదెలలోని ఫంక్షన్హాల్లో ఫౌండేషన్ 13వ వార్షికోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. నేత్ర, అవయవదానం చేసిన కుటుంబీకులను సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా వచ్చిన సీపీ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతికంగా మానవుడు ఎంతో పురోభివృద్ధి సాధించినా అవయవాలను మాత్రం ఇంకోకరిని నుంచి సేకరించాల్సిందేనని అన్నారు. చనిపోయిన తర్వాత నేత్రాలు దానం చేస్తే మరికొందరికీ చూపును ఇచ్చిన వారమవుతామని తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తికి హైదరాబాద్లో గుండె మార్పిడి చేసిన విషయం గుర్తు చేశారు. ఓదెల గ్రామంలో 100 మంది వరకు నేత్రాలను దానం చేయడం హర్షనీయమనీ, అందుకు కృషి చేసిన ప్రైవేట్ వైద్యుడు మేర్గు బీష్మాచారిని అభినందించారు. తాను 10 సంవత్సరాల క్రితమే కర్నూల్లో పని చేసేటప్పుడు అవయవదానానికి అంగీకార పత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రవణ్కుమార్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 440 నేత్రాలు, 57 మంది అర్గాన్ దానం, 50 డెడ్బాడీలను పరిశోధనలకు ఇప్పించడం జరిగిందని వివరించారు. కాగా సమావేశంలో 101 దీపాలను తలపై పెట్టుకుని నాంసానిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు పోతుగంటి శ్రీనివాస్ చేసిన ప్రదర్శనకు ఆహుతులు ముగులయ్యారు. సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐ ఇంద్రాసేనారెడ్డి, ఎస్ఐ లక్ష్మణ్, ఫౌండేషన్ కార్యదర్శి లింగమూర్తి, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, వైస్ఎంపీపీ పల్లె కుమార్గౌడ్, ఆకుల మహేందర్, బోడకుంట చినస్వామి, క్యాతం వెంకటేశ్వర్లు, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.