ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
మెట్పల్లి పట్టణంలోని నాలుగు వార్డుల్లో నీటి సరఫరా ప్రారంభం
మెట్పల్లి, జనవరి 1: మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు పనులు చకచకా కొనసాగుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 9,10,19,20 వార్డుల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో మిషన్ భగీరథ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పట్టణంలోని పలు వార్డుల్లోనూ మిషన్ భగీరథ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే పదో వార్డులో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు సంబంధించి రూ.ఏడు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపల్ నిధులతో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్రావు, కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్, మెగా సంస్థ ఏఈలు అరుణ్కుమార్, అనన్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మెట్పల్లి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో పట్టణం, మండలానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాల్లో అత్యధికంగా లబ్ధిదారులు కలిగిన నియోజకవర్గంగా కోరుట్ల ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, కౌన్సిలర్లు ఒజ్జెల బుచ్చిరెడ్డి, లంక గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు ఆకుల ప్రవీణ్, ఒజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.