కరీంనగర్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక చాలా ప్రశాంతంగా జరిగిందని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని రిటర్నింగ్ అధికారి, హుజూరాబాద్ ఆర్డీవో సీహెచ్ రవీందర్రెడ్డి సూచించారు. ఆదివారం కరీంనగర్లోని కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారని, 86.64 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీలు, పోటీ చేసిన అభ్యర్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 2న కరీంనగర్లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలో కౌంటింగ్ జరుగుతుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని కోరారు. శనివారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ స్టేషన్ నంబర్ 200లో మాక్ పోలింగ్ సమయంలో ఒక వీవీ ప్యాట్లో సాంకేతిక సమస్య వచ్చి మొరాయించిందని తెలిపారు. దాని స్థానంలో సెక్టోరల్ అధికారి రిజర్వ్లో ఉన్న మరో వీవీ ప్యాటు వినియోగించారని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి ప్రిసైడింగ్ అధికారి, సెక్టోరల్ అధికారి, పోలింగ్ సిబ్బంది, ఎసార్ట్ పోలీసులతో ఆర్టీసీ బస్సులో ఈవీఎం యంత్రాలతో కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కళాశాలలోని రిసెప్షన్ సెంటర్కు వచ్చారని తెలిపారు. పనిచేయని వీవీ ప్యాట్ను రిసెప్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గోడౌన్లో అప్పగించేందుకు ఎదురుగా ఉన్న ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారి వాహనంలో గోదాంకు తీసుకు వెళ్తున్న ప్రభుత్వ డ్రైవర్పై అనుమానంతో ఎవరో వీడియో తీసి వైరల్ చేశారని పేర్కొన్నారు. ఈవీఎంలు మార్చారని సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని రిటర్నింగ్ అధికారి రవీందర్రెడ్డి కోరారు. డిఫెక్టెడ్ వీవీ ప్యాట్లను ఇండోర్ స్టేడియంలోని గోడౌన్లో భద్రపరుస్తారని తెలిపారు. ఈ విషయమై అభ్యర్థులు, వారి ప్రతినిధులకు వివరించగా వారు సమ్మతించారని పేర్కొన్నారు. పోలింగ్లో వినియోగించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను ఎస్సారార్ ప్రభుత్వ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచామని తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు, సందేహాలకు తావు లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నమ్మకూడదని రవీందర్రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.