హుజూరాబాద్టౌన్, అక్టోబర్ 26: ‘నేను మీ పేదింటి బిడ్డను. మీ మధ్యే పెరిగిన వ్యక్తిని. అన్నలారా.. అక్కలారా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తా. మీ వెంటే ఉంటా’ అని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు పరిధిలో ఇందిరానగర్కాలనీ, సూపర్ బజార్లోని 26వ వార్డులో మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఇంటింటా ప్రచారం చేశారు. సాయంత్రం 13 వార్డు దళితవాడతోపాటు పలు చోట్ల ఓట్లు అభ్యర్థించారు. సాయంత్రం ఇల్లందకుంట మండల కేంద్రంలో నిర్వహించిన ధూంధాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. యువతీయువకుల కష్టాలు తెలిసిన వాడిగా, విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసి 130కి పైగా కేసుల పాలైన బిడ్డగా తనను ఆదరించాలని కోరారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను కోటీశ్వరుడైన బీజేపీ అభ్యర్థి ఈటలపై పోటీ చేస్తున్నానని, ఇది ఉన్నోనికి లేనోనికి మధ్య జరుగుతున్న సంగ్రామం అని స్పష్టం చేశారు. తాను గెలిస్తే ఏమి చేస్తానో చెబుతున్నానని, ఈటల మాత్రం ఏం చేస్తాడో చెప్పకుండా ఉత్త ముచ్చట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
ఈటల గెలిస్తే మళ్లీ పాత కథేనని, హుజూరాబాద్ ప్రగతి కుంటుపడుతుందని, తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్తో మాట్లాడి హుజూరాబాద్కు ఒక మెడికల్ కాలేజీ, 5వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని, అర్హులందరికీ పథకాలు అందిస్తానని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలను గుర్తు చేసుకొని, ఇటీవల జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 30న జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, పట్టాలు ఇప్పించానని, నిరుద్యోగ యువతీ యువకుల కోసం దుకాణ సముదాయాలు కట్టించి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. మళ్లీ గెల్లు శ్రీనును గెలిపిస్తే తన హయాంలో జరిగిన అభివృద్ధి కన్నా రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, 13వ, 26వ వార్డు కౌన్సిలర్లు కొండ్ర జీవిత నరేష్, కేసిరెడ్డి లావణ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, సిద్దిపేట, కొత్తపల్లి కౌన్సిలర్లు ఉన్నారు.
దళితబంధు దేశానికే దిక్సూచి
దళితులకు మట్టి నుంచి బంగారం తీసే శక్తి ఉన్నది. కానీ, వాళ్లకు చేయూత లేదు. వాళ్లు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారు. ఇది ఒక్క సింగిల్ స్కీం కాదు బహుళ ప్రయోజనాలు చేకూర్చే పథకం. రాబోయే రోజుల్లో దేశానికే దిక్సూచిగా మారుతుంది. ఇంతటి మహత్తర పథకంపై కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నరు. దళితబంధు తీసుకునేటోళ్లకు రైతుబంధు, రైతుబీమా కట్ అవుతాయని అంటున్నరు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. అలాంటి మాటలు నమ్మొద్దు.