జమ్మికుంట చౌరస్తా/జమ్మికుంట, అక్టోబర్ 26: “రానున్న రోజుల్లో హుజూరాబాద్-జమ్మికుంట పట్టణాలను అద్భుతంగా తీర్చిదిద్దుతం. హైదరాబాద్-సికింద్రాబాద్, వరంగల్-కాజీపేట-హనుమకొండ తరహాలో మహా పట్టణాలుగా అభివృద్ధి చేస్తం. ఇందుకోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి పేరిట ఏర్పాటు చేయాని సీఎం కేసీఆర్ను కోరుతం” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జమ్మికుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్కు కుడివైపు నుంచి వెళ్లాల్సిన నేషనల్ హైవే-563ని రెండు పట్టణాల మధ్యలో నుంచి తీస్తున్నామని చెప్పారు. హైవే కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడే అన్ని ప్రక్రియలు పూర్తికాగా, ప్రస్తుతం భూసేకరణ జరుగుతున్నదని చెప్పారు. రెండు పట్టణాల మధ్యలో హైవేపై అద్భుతమైన బటర్ఫ్లై సర్కిల్ను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. రెండు పట్టణాలకు ఉపయోగపడేలా స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి అభివృద్ధి వల్ల కేవలం పట్టణాలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఉపాధి లభిస్తున్నందన్నారు.
అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా), శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) మాదిరిగానే జమ్మికుంట, హుజూరాబాద్లో కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేస్తుందని తెలిపారు. ఈ రెండు పట్టణాల మున్సిపల్ పాలకవర్గాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కోసం తీర్మానం చేసి అందించాలని కోరారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా చేసి చూపిస్తున్నారని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలని, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఇంట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో టీజీబీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, వరంగల్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ అర్బన్శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, రాము, నాయకులున్నారు.
వినోద్కుమార్ ఔదార్యం
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను తన కారులో దవాఖానకు తరలించి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఔదార్యం చాటుకున్నారు. హుజూరాబాద్ మండలంలోని మందాడిపల్లి శివారులో మంగళవారం రాత్రి కరీంనగర్ చెందిన గడ్డం మహేందర్రెడ్డి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అటువైపు నుంచి వెళ్తున్న వినోద్కుమార్ ఘటనను గమనించి, క్షతగాత్రుడు మహేందర్రెడ్డిని తన వాహనంలో హుజూరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించేలా ఏర్పాట్లు చేశారు.