కార్పొరేషన్, సెప్టెంబర్ 28: సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్లో భాగంగా నగరాలు, పట్టణాల్లోని సెప్టిక్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టిక్ ట్యాంక్ల వివరాలు పూర్తిస్థాయిలో బల్దియాకు సమాచారం ఉండేలా చూస్తున్నారు. ఇందులో భాగంగా నగరాల్లో ఎన్ని సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి.. ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలను సేకరించి బల్దియా యాప్లో పొందుపరుచనున్నారు. ఇందుకోసం ఇప్పటికే బల్దియా అధికారులు చర్యలు ప్రారంభించారు.
ట్యాంకులన్నీ జియో ట్యాగింగ్
సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంకులన్నింటినీ జియో ట్యాగింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగర పాలకసంస్థ పరిధిలో ఇప్పటికే పలు ట్యాంకులను జియో ట్యాగింగ్ చేయగా.. మిగతా వాటిని కూడా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. ముఖ్యంగా ప్రతి సెప్టిక్ ట్యాంక్ను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు నగరపాలక సంస్థ పరిధిలోని ట్యాంకుల వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ట్యాంక్ను మూడేళ్లకోసారి శుభ్రం చేయాల్సి ఉంటుంది. దీనిని సక్రమంగా అమలు చేసేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. నగరంలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయో తెలిసిన తర్వాత ప్రతి ఏటా ట్యాంకులను శుభ్రం చేయించడమే లక్ష్యంగా పని చేయనున్నారు. ఒకసారి బల్దియా సిబ్బంది సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసిన తర్వాత ప్రతి మూడేళ్లకోసారి క్లీన్ చేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఈనెలాఖరులోగా నగరంలోని ప్రతి సెప్టిక్ట్యాంక్ను జియోట్యాగింగ్ చేయనున్నట్లు బల్దియా అధికారులు తెలిపారు.