హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 20: ‘సదన్నా ఎట్లున్నవే..ఇంటికాడ అందరు మంచిగున్నరా..సమ్మన్నా అంతా బాగేనా..ఆరోగ్యం ఎట్లున్నదే’ అంటూ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ సెలూన్షాపు వర్కర్, హోటల్ నిర్వాహకుడిని ఆత్మీయంగా పలుకరించిండు..సోమవారం ఉదయం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిండు..చిరు వ్యాపారులు, కిరాణా దుకాణాల యజమానులను పలుకరిస్తూ ముందుకెళ్లిండు..హుజూరాబాద్ బస్టాండ్ వద్ద గల సెలూన్ షాపులో ఎలాంటి హడావుడి లేకుండా సామాన్యుడిలా కటింగ్ చేయించుకున్నడు..దగ్గరిలోని ఓ హోటల్కు వెళ్లి చాయ్ తాగిండు..అక్కడే పలువురి ఓటర్లతో చిట్చాట్ చేసిండు. సెలూన్షాపులో కటింగ్ చేయించుకుంటూనే వర్కర్ సదానందం, హోటల్లో సమ్మయ్యతో ముచ్చటించిండు. మీ ఓటు ఎవరికెస్తరని అడిగిండు..వారు కూడా సంతోషంగా ఆయనతో మాట్లాడిన్రు..అన్నా ఎవరికెత్తమే..మా నాయీబ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్న సర్కారుకే ఓటేస్తామని సదానం చెప్పిండు..‘ ప్రభుత్వం మాకు రోడ్ల పక్కన దుకాణాలు పెట్టుకొనేందుకు అవకాశం ఇచ్చింది..వ్యాపారం గూడా బాగా జరుగుతుంది..నాలుగు రాళ్లు వెనుకేసుకుంటున్నం..మా కులపొళ్లకు గూడా చేపలు అమ్ముకునేందుకు వాహనాలిచ్చింది. ఉట్టిగనే చేప పిల్లలను పోస్తున్నది. గింత మంచి చేస్తున్న టీఆర్ఎస్కే ఓటేస్తా’ అని సమ్మయ్య బదులిచ్చాడు. గెల్లు శ్రీనివాస్ వీరితో పాటు పలువురితో మమేకమై ఓటు అభ్యర్థించారు. పేదబిడ్డనైనా తనను గెలిపించాలని కోరిండు. తనను అసెంబ్లీకి పంపిస్తే వారి అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిండు. ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని భరోసానిచ్చిండు. సర్కారు అమలు చేస్తున్న పథకాలను వారికి విడమరిచి చెప్పిండు. దీంతో ఓటర్లు సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతకుముందు గెలిచిన వారేవరూ గింత మంచిగా మాట్లాడలేదని, సమస్యల గురించి తెలుసుకోలేదని..ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ కారుకే ఓటేస్తమని కుండబద్దలు గొట్టిన్రు.. శ్రీనివాస్ వెంట కౌన్సిలర్ ముక్క రమేశ్, టీఆర్ఎస్ నాయకులు ఆవాల హరిబాబు, ఆకుల వెంకటేశ్, టీఆర్ఎస్ 16వ వార్డు అధ్యక్షుడు పిల్లి సమ్మయ్య, ఓటర్లు బీ సమ్మయ్య, శ్రీనివాస్, రవి, రాజు, సతీశ్, సంపత్ తదితరులు ఉన్నారు.