కార్పొరేషన్, ఫిబ్రవరి 11: కరీం‘నగర’ ప్రజలకు శుభ్రమైన ఆహారపదార్థాలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. సకల హంగులతో నగరానికి నలువైపులా నిర్మిస్తామని చెప్పారు. ఇందులో మాంసం, పండ్లు, కూరగాయల అమ్మకాలు సాగేలా తగిన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట గల ఇరిగేషన్ శాఖ స్థలంలో రూ.14కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ మార్కెట్ సముదాయాన్ని జీప్లస్ టూ పద్ధతిలో 347 షాపులతో నిర్మిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వీటిలో అధునాతన వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డులో పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. త్వరలోనే మార్కెట్రోడ్డుకు సమీపంలో మరో సమీకృత మార్కెట్ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే పద్మనగర్, ఆర్టీసీ వర్క్షాపు వద్ద స్థల సేకరణ పూర్తిచేశామని తెలిపారు. కశ్మీర్గడ్డ మార్కెట్కు సంబంధించి టెండర్ ప్రక్రియను సైతం పూర్తిచేశామని తెలిపారు. వారంలోగా పనులు ప్రారంభిస్తామన్నారు. టవర్సర్కిల్లో ఆర్ అండ్ బీ శాఖకు చెందిన స్థలాన్ని సేకరించి పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్ధమైందని, త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి భూమిపూజ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, నగర మేయర్ వై.సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్లు ఉన్నారు.