మెట్పల్లి, ఆగస్టు 2: ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఖాళీ అయిన రేషన్ డీలర్ల స్థానంలో కొత్త వారిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెట్పల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి మండలాల్లో 13, కోరుట్ల డివిజన్ పరిధిలోని కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో 17 చౌకధరల దుకాణాల డీలర్ల భర్తీకి ఈనెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల దాఖలుకు ఈనెల 11 వరకు చివరి గడువుగా నిర్ణయించారు. అదే విధంగా రిజర్వేషన్ల ఆధారంగా డీలర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ మేరకు రెవెన్యూ డీలర్ల ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మెట్పల్లి పట్టణంలో (దుకాణం నంబర్ 2714005)-ఓసీ, (దుకాణం నం 2714014)-ఓసీ, రేగుంట (2714017)-ఓసీ, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్ (2705007)-ఓసీ, బర్దీపూర్ (2705014)-ఓసీ, ఎర్రాపూర్ (2705024)-ఓసీ, తిమ్మాపూర్ తండా (2705025)-ఎస్టీ, మల్లాపూర్ మండలం గొర్రెపల్లి (2711003)-ఓసీ, రేగుంట (2711006)-ఓసీ, నడికుడ(2711012)-ఓసీ, మొగిలిపేట(2711013)-ఓసీ, సంగెం శ్రీరాంపూర్(2711016)-ఓసీ, వీవీరావుపేట (2711023)-ఓసీ, కథలాపూర్ మండలం సిరికొండ (2708003)-ఎస్టీ, బొమ్మెన (2708027)-ఓసీ, నాగులపేట (2710002)-ఓసీ మహిళ, గుమ్లాపూర్ (2710005)-పీహెచ్సీ, చిన్నమెట్పల్లి (2710015)-పీహెచ్సీ, కోరుట్ల పట్టణం (2710045)-ఎస్టీ, ధర్మారం (2710055)-ఎస్టీ, మేడిపల్లి మండలం కొండాపూర్ (2713003)-ఓసీ, పోరుమల్ల (2713008)-ఓసీ, రాజలింగంపేట (2713013)-ఓసీ, కాచారం (2713024)-ఓసీ, మాచాపూర్ (2713026)-ఓసీ, మేడిపల్లి (2713029)-ఎస్టీ, గుండ్లపల్లి (2713030)-ఓసీ, విలాయతాబాద్ (2713031)-పీహెచ్సీ, మోత్కురావుపేట (2713032)-ఓసీ, మన్నెగూడెం (2713033)-ఎస్టీలకు కేటాయించారు.
అర్హతలు
నిరుద్యోగులు లేదా మహిళా స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలు లేదా మహిళలు ప్రత్యేకంగా నిర్వహించే పట్టణ, గ్రామీణ మహిళా స్వయం సహాయ బృందాలు డీలర్ల నియామకానికి అర్హులు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన అర్జీదారులకు ఎంపికలో ప్రాముఖ్యతను ఇవ్వనున్నారు. మహిళలకు రిజర్వ్ చేసిన చౌకధరల దుకాణం డీలర్ల భర్తీలో మాజీ సైనిక ఉద్యోగుల భార్యలకు ప్రాధాన్యతను కల్పించనున్నారు. దరఖాస్తు దారు కనీసం పదో తరగతి లేదా తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన వ్యక్తులు లేని పక్షంలో ఏడో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్జీ సమర్పించుకునేందుకు అర్హులు. అర్జీదారుకు ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. నిత్యావసర వస్తుల చట్టం కింద నేర చరిత్ర ఉండకూడదు. దరఖాస్తుదారు 18 ఏండ్ల వయసు నిండి 40 సంవత్సరాలు మించకుండా ఉన్నవారు అర్హులు. స్థానికులై ఉండాలి. రాత పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా డీలర్లను భర్తీ చేయనున్నారు. ఈనెల 4 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మెట్పల్లి, కోరుట్ల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు స్థానిక ఆర్డీవో వినోద్కుమార్ తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.