కరీంనగర్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) :జిల్లాలో వారం నుంచి ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షాలు సోమవారం రాత్రి ఒక్కసారిగా భారీ నుంచి అతి భారీ వర్షాలుగా మారాయి. జిల్లా వ్యాప్తంగా కుండ పోతగా కురిసింది. కరీంనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి. ముఖ్యంగా కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై ఆర్టీసీ వర్క్షాప్ వద్ద విపరీతమైన వరద వచ్చింది. కార్లు, ఆటోలు మునిగి పోయాయి. ఉదయం కొద్ది సేపు భారీ వాహనాలు మాత్రమే వెళ్లాయి. ఇటు పద్మనగర్లో ఇదే పరిస్థితి కనిపించింది. 18, 19, 21, 38వ డివిజన్లలో రోడ్లపై వరద నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద వచ్చి చేరింది. కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల చెక్డ్యాం పొంగి పొర్లుతున్నది. మానేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగు ఒడ్డున ఉన్న గ్రామాల్లోని ఇండ్లలోని నీళ్లు వచ్చాయి. కొత్తపల్లి పట్టణంలో కూడా వర్షం ప్రభావాన్ని చూపింది. కమాన్పూర్లో సిరిసిల్ల రోడ్డుపై చేపట్టిన వంతెన నిర్మాణం వద్ద వరద పొంగి రాకపోకలకు అంతరాయమేర్పడింది.
చొప్పదండి నియోజకర్గం పరిధిలోని పంది వాగు పొంగిపొర్లుతున్నది. కుడిచెరువు మత్తడి నుంచి దుంకడంతో రెడ్డివాడ ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. రామడుగు మండలంలోని మోతెవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నిర్మాణంలో ఉన్న మోతె చెక్ డ్యాం తెగిపోయింది. రామడుగులో మూడు ఇండ్లు కూలిపోయాయి. కొత్తపల్లి మండల కేంద్రం నుంచి వెలిచాల వెళ్లే మార్గంలో రొడ్యాం పొంగి పొర్లడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గంగాధర నుంచి బోయినపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పోతుగంటి పల్లి వద్ద తెగడంతో రాకపోకలు నిలిచి పోయాయి. వెంకటయ్యపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. నారాయణపూర్ రిజర్వాయర్లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిజర్వాయర్ కట్టవద్ద రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు క్యాంపును ఏర్పాటు చేసుకున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా పట్టణ సమీపం నుంచి చిలుక వాగు ఉప్పొంగుతున్నది. మామిండ్లవాడ, బుడిగె జంగాల కాలనీ, గాంధీనగర్, ఫకీర్పేట, తదితర కాలనీల్లోకి నీళ్లు చేరాయి. వ్యవసాయ, నీటి పారుదల శాఖల కార్యాలయాలు నీటితో నిండి పోయాయి. పెద్దపాపయ్యపల్లిలో మైనార్టీ రెసిరెడిన్సియల్ పాఠశాల మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. పాఠశాల ప్రహరీ కూలిపోయింది. 30 ఏండ్లలో ఇంత వర్షం చూడలేదని స్థానికులు చెబుతున్నారు. కరీంనగర్, వరంగల్ రహదారిపై మాందాటిపల్లి వద్ద రోడ్ల మీదుగా వరద ప్రవాహం కొనసాగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరంగల్, కరీంనగర్ రహదారిపై ఇదే చోట 70 ఏండ్ల కింద అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెప్పారు. చిలుకవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మండలంలోని జూపాక, బొత్తలపల్లి, కుర్మపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జమ్మికుంట మండలం మాచనపల్లికి రెండు వైపులా రోడ్లు, పాపక్కపల్లి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందకుంటలో మల్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వీణవంక వాగు పొంగి పొర్లుతున్నది. పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం ఆముదాలపల్లి, వీణవంక మార్గంలో వరదలతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆముదాలపల్లిలో ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. కేశవపట్నం వాగు మునుపెన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. మానకొండూర్ మండలం ముంజంపల్లి నుంచి తిమ్మాపూర్ వెళ్లే మట్టి రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచి పోయాయి. శ్రీనివాసనగర్లోని బర్లం చెరువు మత్తడి ఉధృతంగా దుంకుతున్నది. తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లో భారీ వర్షం కురిసింది.
సైదాపూర్ మండలం అతలాకుతలం అయ్యింది. వెన్కేపల్లిలోని తుమ్మల చెరువు కట్టుకాలువ తెగిపోయింది. బొత్తలపల్లి, సైదాపూర్ కల్వర్టు మీదుగా వరద విపరీతంగా ప్రవహిస్తున్నది. సైదాపూర్ నుంచి హుజూరాబాద్ వెళ్లే రహదారి జల దిగ్బంధంలో చిక్కుకుంది. సైదాపూర్ నుంచి రాయికల్కు రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్, మొలంగూర్ మధ్యన, సర్వాయిపేట కల్వర్టు తెగడంతో రాకపోకలు నిలిచి పోయాయి. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి.