జమ్మికుంట చౌరస్తా/జమ్మికుంట, అక్టోబర్ 26: ‘బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్, ఈటల రాజేందర్ పూటకో మాట మాట్లాడుతున్నరు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే చెబుతున్నరు. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నరు? వాళ్లను ఇంకా నమ్మిమోసపోదామా..? బీజేపీతో నష్టమే తప్పా రూపాయి లాభం లేదు. 30న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేసి.. బీజేపీకి గుణపాఠం చెబుదాం’ అని ప్రజలకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన జమ్మికుంట పట్టణంలోని 1,2,3,5 వార్డుల్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నదని ఆరోపించారు. ఎన్నికలు అయిపోగానే గ్యాస్ సిలిండర్ ధరను మరో రూ.200 పెంచేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తెప్పించి అందరి ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.15 లక్షలు వేస్తామన్న కేంద్రం పన్నుల పేరిట ఉన్న డబ్బులను గుంజుకుంటుందని మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క నిరుద్యోగికన్నా ఉద్యోగం కల్పించిందా..? అని ప్రశ్నించారు. ‘గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటాడని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తడని చెప్పారు. ఇక్కడ టంగుటూరి రాజ్కుమార్, కౌన్సిలర్లు రవీందర్, భిక్షపతి, వీరన్న, నాయకులు సమ్మిరెడ్డి, సత్యనారాయణ, వద్దిరాజు రవి చంద్ర, రామస్వామి, రంజిత్, రమేశ్, నరేశ్, రాకేశ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రామన్నపల్లికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కూరెళ్ల రాము, హనీఫ్, తిరుపతి టీఆర్ఎస్లో చేరారు. ఇదే గ్రామంలో ఇటీవల మృతి చెందిన మర్రి మలయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.