హుజూరాబాద్, అక్టోబర్ 18: బీజేపీకి ఓటెందుకు వేయాలో చెప్పాలని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ను కరీంనగర్ మేయర్ సునీల్రావు ప్రశ్నించారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ , పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులపై భారం మోపినందుకా..? నల్లచట్టాలు తెచ్చి రైతులకు అన్యాయం చేసిందుకా..? నల్ల చట్టాలు రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులను కార్లతో తొక్కి చంపినందుకా..? ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. టీఆరెస్సోళ్లు మద్యం, డబ్బులు ఎరవేస్తూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఈటల పదేపదే మాట్లాడడం ప్రజలను కించపరిచినట్లేనని చెప్పారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులనీ, ఎవరిని అక్కున చేర్చుకోవాలో, ఎవరిని బొంద పెట్టాలో వాళ్లకు తెలుసునని హితవు పలికారు. ఇప్పటి వరకు ఈటల సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టడమే కాక టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతుందని బద్నాం చేయడం సమంజసం కాదన్నారు. నియోజకవర్గంలో మొదటి నుంచి టీఆర్ఎస్ బలంగా ఉందని, ఆయన పార్టీలోకి రాక ముందే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఎంపికైన ఘనత ఉందన్నారు. ఆరుసార్లు కేవలం కేసీఆర్ చరిష్మా, కారు గుర్తు మీద రాజేందర్ గెలిచి కేసీఆర్ను విమర్శించడం సిగ్గు చేటన్నారు. బీజేపీ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పి ఓట్లు అడుగాలని డిమాండ్ చేశారు. రాజేందర్ ఎక్కడైనా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు గురించి మాట్లాడుతున్నాడా..? ధరలు తగ్గిస్తామని కనీసం ఎక్కడైనా చెబుతున్నాడా..? ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో ఎంతో కష్టపడి కాజీపేట నుంచి హుజూరాబాద్ మీదుగా కరీంనగర్ దాకా రైల్వేలైన్ తీసుకువస్తే దానిని కేంద్రం రద్దు చేసిందని, దీని గురించి ప్రజలకు ఏం సమాధానం చెబుతావని ప్రశ్నించారు. ఈటల ఓటమి ఖాయమైందని, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కార్పొటర్ పిట్టల శ్రీనివాస్, నాయకుడు బత్తుల రాజలింగం తదితరులు ఉన్నారు.