తెగుళ్ల నివారణ చర్యలు తీసుకోవాలి
సాగు సర్వేలో వ్యవసాయాధికారులు
జమ్మికుంట రూరల్, ఫిబ్రవరి 11: రైతులు యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో సతీశ్ సూచించారు. మండలంలోని నగురం గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పంట సాగు వివరాలను నమోదు చేశారు. అంతకుముందు తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట మార్పిడి చేయడంతో దిగుబడి పెరుగుతుందని చెప్పారు. రైతులు లాభదాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. పంట సాగు వివరాలను నమోదు చేసుకుంటే దిగుబడులను సులువుగా విక్రయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సాగు సమస్యలపై వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఇక్కడ రైతులు ఉన్నారు.
మల్యాలలో..
ఇల్లందకుంట, ఫిబ్రవరి 11: రైతులు పంటలను తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈవో సంపత్ సూచించారు. శుక్రవారం మండలంలోని మల్యాల గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. పంట వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెగుళ్ల నివారణకు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటించాలని సూచించారు. సాగు చేస్తున్న పంటల వివరాలను రైతులు తప్పక నమోదు చేసుకోవాలన్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు.
పప్పు పంటల సాగుపై రైతులకు అవగాహన
తిమ్మాపూర్, ఫిబ్రవరి 11: మండలంలోని మక్తపల్లి గ్రామంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పప్పు పంటలపై శుక్రవారం అవగాహన కల్పించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ నిర్వహిస్తున్న ప్రథమ శ్రేణి క్షేత్రాల ద్వారా పప్పు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పప్పు పంటల సాగు వల్ల లాభాలు పొందవచ్చని సేద్య విభాగం శాస్త్రవేత్త విజయ్ రైతులకు సూచించారు. అలాగే పంటల యాజమాన్య పద్ధతులను వివరించారు. వ్యవసాయాధికారి జే సురేందర్, ఏఈవో స్వామి, రైతులు పాల్గొన్నారు.