హుజూరాబాద్టౌన్, అక్టోబర్ 25: మీ ఇంటి బిడ్డగా అండగా ఉంటా.. ఒక్క అవకాశమిచ్చి గెలిపించండని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని దమ్మక్కపేట గ్రామంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దమ్మకపేట గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బరిగే గట్టయ్యయాదవ్, అతడి భార్య గత స్వంతంత్య్ర ఎమ్మెల్యే అభ్యర్థి బరిగే మాధవరాణి దాదాపు 200 మందితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పెరిగిన ధరలకు మద్దతు తెలుపుతారో.. మన ప్రాంత అభివృద్ధికి మద్దుతు తెలుపుతారో ఆలోచించాలని సూచించారు. తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్ను బతిమిలాడి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులు తెస్తానని హామీనిచ్చారు. అనంతరం గెల్లు శ్రీనివాస్యాదవ్ను వార్డు కౌన్సిలర్ మెరుగు కొండాల్రెడ్డి, ప్రజలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మెరుగు కొండల్రెడ్డి, కరీంనగర్ కార్పొరేటర్ జంగిలి సాగర్, టీఆర్ఎస్ నాయకులు అపరాధ మహేశ్, కోడారి రాజు, సల్పాల రాజు యాదవ్, రాంపెల్లి హరీశ్చారి, మునిగంటి రాకేశ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
ఈటల వైఖరి నచ్చకనే బయటికి వచ్చిన..
ఈటల రాజేందర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నడు. ఆయన వైఖరి నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసిన. నా భార్య మాధవరాణితో పాటు 200 మందితో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరినం. గతంలో ఈటలకు ఎన్నికప్పుడు మద్దతు తెలిపినం. ఓసారి ఓ విషయంలో సాయం చేయాలని అడిగితే సూటిపోటి మాటలతో హేళన చేసిండు. ఇప్పుడు వ్యక్తిగత ప్రచారం చేసుకుంటుండు తప్పా పార్టీ కోసం పనిచేస్తలేవు. అంతా ఈటల అనేలా చూపెట్టుకుంటాండు. పేదింటి బిడ్డ గెల్లు సీను గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తం. – బరిగె గట్టయ్య, బీజేపీ సీనియర్ నాయకుడు, దమ్మకపేట
జాగ కావాలంటే ఎగతాళి జేసిండు..
మెకానిక్లమందరం శాశ్వతంగా దుకాణాలు పెట్టుకోనికె ప్రభుత్వ స్థలం ఇప్పించాల్నని ఈటల రాజేందర్ను చానా సార్లు కోరినం. ఎన్నికలు వస్తేనే మీకు జాగలు, భూములు కావాల్నా.. అని ఎగతాళి జేసిండు. ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినం. అన్నీ బుట్టదాఖలు జేసిండు. ఇటీవల మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ను కలిసినం. అడుగంగనే ఆటోనగర్ ఏర్పాటు చేసుకునేందుకు పది ఎకరాల స్థలం కేటాయించిన్రు. మెకానిక్లు అంటే చిన్నచూపు చూసి ఎగతాళి జేసిన ఈటలకు ఓటుతో సరైన బుద్ధిచెప్తం. మా 355 మంది ఆటోమొబైల్ కార్మిక కుటుంబాల సభ్యులందరం కారు గుర్తుకు ఓటెస్తం. గెల్లు సీను గెలుపులో భాగమైతమ్.
నేను మీ సేవకుడిని. మీ ఇంటి బిడ్డగా.. మీ ఊరి మనిషిగా వస్తున్న.. ఒకసారి అవకాశం ఇవ్వండి.. ఆశీర్వదించండి.. ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఒక్క అవకాశమిచ్చి గెలిపించండి.. సీఎం కేసీఆర్ దీవెనలతో మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుత. ఈ పోరు వందల ఎకరాలున్న ఆసామికి, రెండు గుంటల భూమున్న పేదోడికే. నాకు కోటల్లాంటి ఇండ్లు లేవ్. మీకు సేవ చేయాలనే ఈడికి వస్తున్న. నన్ను ఆదరించి, ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేయండి.