చిగురుమామిడి, సెప్టెంబర్ 28: రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లోని కుంటలు, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పలు చోట్ల పంట పొలాలు నీటమునిగాయి. ఆస్తి నష్టం జరగలేదని తహసీల్దార్ ముబీన్ అహ్మద్ తెలిపారు.
శంకరపట్నం మండలంలో..
శంకరపట్నం, సెప్టెంబర్ 28: గులాబ్ తుఫాన్ ప్రభావంతో సోమవారం కురిసిన వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో కోత దశలో ఉన్న వరి నేలవాలింది. పలు చోట్ల వరి పొలాల్లో వరదనీరు చేరింది. కన్నాపూర్, తాడికల్, అంబాల్పూర్, మొలంగూర్, కొత్తగట్టు, గద్దపాక తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. దాదాపు 450 హెక్టార్లలో వరి పైరు దెబ్బ తిన్నట్లు ఏవో శ్రీనివాస్ తెలిపారు. ముత్తారం రామసముద్రం చెరువు, కేశవపట్నం పెద్ద చెరువు, మొలంగూర్ దామెర చెరువు, మెట్పల్లి పెద్ద చెరువు నిండి మత్తడి దుంకుతున్నాయి. అర్కండ్ల గ్రామం వద్ద వాగు ఉధృతితో రాకపోకలు నిలిచాయి. ముత్తారం రామసముద్రం చెరువు మత్తడి ఉధృతి పెరిగింది. అర్కండ్ల వద్ద రోడ్యాం మీదుగా వరదనీరు పారింది. అర్కండ్లతో పాటు వీణవంక మండలం వైపు నుంచి శంకరపట్నం గ్రామాలకు కన్నాపూర్ మీదుగా రాకపోకలు నిలిచాయి. తప్పనిసరి పరిస్థితుల్లో తాడికల్, ఎరడపల్లి మీదుగా అర్కండ్ల తదితర గ్రామాలకు వెళ్లారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 28: మండలంలోని మద్దికుంట, పోచంపల్లి, కెల్లేడ, రంగపేట, కొండపల్కల, గంగిపల్లి, వెల్ది, వేగురుపల్లి గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పంటలు నేలకొరిగాయి. పంట పొలాల్లో వరద నీరు చేరింది. దేవంపల్లి, శ్రీనివాస్నగర్, ముంజంపల్లి, గంగిపల్లి, కొండపల్కల గ్రామాల్లోని చెరువులు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి.