హుజూరాబాద్, అక్టోబర్ 12 : ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ కుట్రలకు తెర తీస్తున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో ఆటోను కారు ఢీకొట్టి దేశ్రాజ్పల్లికి చెందిన నాగుర్ల రాజేందర్ చనిపోయిన సంఘటన టీఆర్ఎస్కు అంటగడుతూ అసత్య ప్రచారాలు చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా తన కారు వల్లే ప్రమాదం జరగిందంటూ ప్రచారం చేశారని, ఈటల రాజేందర్, వివేక్, ఏనుగు రవీందర్రెడ్డితోపాటు వందలాది మంది ఘటనా స్థలంలో ఆందోళన చేశారని చెప్పారు. నిజానికి ఆ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, బండి సంజయ్ దోస్త్ విశ్వనాథ వినోదే ప్రధాన కారణమని స్పష్టంచేశారు. బీజేపోళ్లు కావాలనే కారుతో ఆటోను గుద్దించి తనపై నెట్టే ప్రయత్నం చేశారని, సానుభూతితో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వారి వ్యవహారం ‘దొంగే.. దొంగ’ అన్నట్లుగా ఉందని, విష సంస్కృతితో కాషాయ దళమంతా నిండిపోయిందని విమర్శించారు.
ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తరు
బీజేపీ నాయకులు ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారని, దాడులు సైతం వెనుకాడరని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పట్టణ సోషల్ మీడియా కార్యకర్త నాంపల్లి జగన్పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు దాడులు ఎక్కడైనా జరిగాయా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ల మీద వాళ్లే దాడులు చేసుకుంటూ టీఆర్ఎస్ మీద మోపుతారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సానుభూతి డ్రామాలాడుతూ ఎదుటి వారి మీద ఆరోపణలు చేయడం వారికే చెల్లుతుందన్నారు. గతంలో దుబ్బాకలో ఇలాగే చేశారని, నెత్తురు రుచి మరిగింది మీరని, తెలంగాణ కోసం నెత్తురు ధారబోసింది మేమన్నారు. కిరాతకులకే ముత్తాతలైన మీరు కొందరు కిరాయి మూకలు హుజూరాబాద్లో ఎన్నికల కోసం దింపినట్లు తెలిసిందన్నారు. పండుగ ముందు కానీ తర్వాత కానీ అల్లర్లు సృష్టించి సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారనే పక్కా సమాచారం ఉందన్నారు. అభ్యర్థి అయి ఉండి ఈటల గంటల పాటు ఎలా రాస్తారోకో చేస్తారని, ఈ విషయమై ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఉప్పల్ ఘటనకు బాధ్యులు బీజేపోళ్లే కాబట్టి ఆటోడ్రైవర్ కుటుంబానికి ఈటల, బండి సంజయ్, వివేక్ తలా రూ.50లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈటల పచ్చి అబద్ధాలు..
మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గ్యాస్ ధర విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సుమన్ మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే స్టేట్ టాక్స్ రూ.291 వసూలు చేస్తున్నారడం ఆయన ఇంగితానికే వదిలివేస్తున్నానన్నారు. కేవలం గ్యాస్ మీద 5శాతం జీఎస్టీ వసూలు చేస్తారని, అది కూడా కేంద్రం, రాష్ర్టాలు సమానంగా తీసకుంటాయని రాజేందర్కు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈటల మీటింగ్కు కరెంట్ అయితే టీఆర్ఎస్ వాళ్లే కట్ చేశారని ప్రచారం చేశారని, మున్ముందు ఇలాంటి సంఘటనలు ఎన్ని చూడాల్సి వస్తుందోనన్నారు. బొట్టుబిల్లలు, గ్రైండర్లు, కుట్టుమిషన్లు, వంటి తాయిలాలను ఇప్పటికే ఈటల పంచిన సంగతి తెలియంది కాదన్నారు.
డీజీపీ సమగ్ర విచారణ చేయాలి: ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
ఉప్పల్లో ఆటోడ్రైవర్ మృతి ఘటనపై డీజీపీ సమగ్ర విచారణ జరుపాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కోరారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లను బ్లాక్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మత విద్వేషాలతో రెచ్చగొడుతున్న బీజేపీని ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, నాయకులు పాడి కౌశిక్రెడ్డి, కొలిపాక శ్రీనివాస్, రియాజ్, నాగరాజు, సాయిచరణ్, గాలి రాకేశ్ ఉన్నారు.