జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. యువత మత్తళ్ల వద్ద చేపలు పడుతూ సందడిగా గడుపుతున్నారు. వరద ప్రవాహంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజ లకు సూచిస్తున్నారు.
వేములవాడలో 2.5మిల్లీమీటర్ల వర్షం
వేములవాడ పట్టణంలో మంగళవారం 2.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గణాంక అధికారి వెంకటరమణ తెలిపారు. మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, జాతరగ్రౌండ్ రహదారులు, ఆలయ పరిసరాల రహదారులపై వరద ప్రవహిస్తున్నది. భక్తులు వరద నీటిలోనే నడుస్తూ బద్ది పోచమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. శివారు, లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్యామ్సుందర్రావు పరిశీలించారు.
చేపలు పట్లేందుకు వెళ్లవద్దు
భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో చేపలు పట్టేందుకు వెళ్లవద్దని సీఐ వెంకటేశ్ సూచించారు. గ్రామాల పరిధిలోని విలేజ్ పోలీస్ అధికారులు వరద పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులల్లో ఉన్నవారు వెంటనే పోలీస్స్టేషన్ లేదా డయల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్, ఎస్ఐ మాలకొండ రాయుడులు పిలుపునిచ్చారు. చేపలు పట్టేందుకు వెళ్లే మత్స్యకారులు, పశులు, గొర్రెల పెంపకందారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దన్నారు. అధికంగా వరద ప్రవహించే బ్రిడ్జిలపై ప్రయాణం చేయవద్దని, పురాతన ఇండ్లలో ఉండవద్దని సూచించారు. అలాగే హన్మాజీపేట వద్ద ఉన్న నక్కవాగు ఉధృతిని పరిశీలించారు. వాగుకు ఇరువైపులా భారీ గేట్లను ఏర్పాటు చేశారు.
కూలిన ఇల్లు
వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన మల్లారం గట్టయ్యకు చెందిన ఇల్లు భారీ వర్షాలకు కొంత భాగం కూలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని గట్టయ్య విజ్ఞప్తి చేశాడు.
చందుర్తి, ఆగస్టు 31: గత రెండు రోజులుగా మండలవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మూడపల్లిలో కల్వర్టు కింది నుం చి వర్షపునీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది.