హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొవిడ్ బాధితులకు ఆనందయ్య ఇచ్చిన మందుపై సీసీఆర్ఎస్ పరిశోధన మంగళవారం రెండోరోజు కూడా కొనసాగింది. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి ఆయుర్వేద కళాశాలల బృందాలు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నాయి. తిరుపతి వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల వారు సోమవారం ఒక్కరోజే 190 మంది నుంచి వివరాలు సేకరించారు. ఫోన్ల ద్వారా సమాచారం సేకరించడంలో సాంకేతిక ఇబ్బందులు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. కొందరు రోగులు స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్నంబర్లు ఇచ్చినట్టు గుర్తించారు. కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా మందు తీసుకున్న వారే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. కరోనా బారిన పడి మందు తీసుకున్న వారి నుంచి వివరాలు సేకరిస్తే మందు ఫలితం తెలిసే వీలుంటుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. అలాంటి వారిలో కనీసం 500 మంది నుంచి సమాచారం తెలుసుకొని విశ్లేషిస్తే మందు ప్రభావంపై ప్రాథమిక నిర్థారణకు రాగలమని పేర్కొన్నారు.
ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఔషధంపై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. ఔషధ పంపిణీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పిటిషనర్లు కోరారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇచ్చిన కరోనా మందుతో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన రవి అనే యువకుడు కోలుకున్నట్టు చెప్తున్నారు. రవి కోలుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోయి ఆపస్మారక స్థితిలో ఉన్న రవికి ఆనందయ్య శిష్యులు పడుకోబెట్టి.. కంట్లో చుక్కల మందు వేశారు. దీంతో 15 నిమిషాల్లో స్పృహలోకి వచ్చిన రవి లేచి నిల్చున్నాడు. ఇదే సమయంలో శిబిరానికి వచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రవికి చేసిన చికిత్సను ప్రత్యక్షంగా తిలకించారు. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతించాలని ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోరారు.