నిజామాబాద్, జులై 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో మాంసాహార ఉత్పత్తిని పెంచడం తో పాటు గొల్ల, కుర్మ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీలుగా రాయితీపై గొర్రెల యూనిట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడుతలో నిజామాబాద్ జిల్లా లో 1104 మందిని, కామారెడ్డి జిల్లాలో 705 మంది లబ్ధిదారులను గుర్తించారు. తొలి విడుతలో అర్హులైన లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు రాయితీపై అందించారు. తాజాగా యూనిట్ ధరను ప్ర భుత్వం పెంచింది. ఇంతకు ముందు రూ.1.25 ల క్షలు ఉండగా ఇప్పుడు రూ.50 వేల పెంపుతో రూ.1.75 లక్షలకు చేరింది. గొల్ల, కుర్మ కుటుంబా ల అభివృద్ధికి తీసుకు వచ్చిన పథకంలోనూ కొంత మంది కక్కుర్తి పడి వక్రబాట పట్టారు. అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో రెండో విడుతలో గొర్రెల పంపిణీని మరింత పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించారు. కొంత మందికి నాసిరకం గొర్రెలను కొనుగోలు చేసి ఇచ్చారని, మరికొంత మందికి గతంలో కొనుగోలు చేసిన వా టినే రీగ్రౌండింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. రీసైక్లింగ్కు అవకాశం లేకుండా వాహనాలకు జీపీఎస్ సిస్టం అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది.
గొల్ల, కుర్మలకు అండగా కేసీఆర్…
ఆసరా కోల్పోయిన వారికి కొండంత అండగా నిలవాలని తలచింది రాష్ట్ర ప్రభుత్వం. గొర్రెల పెంపకంపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టిని అందించే సరికొత్త కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. మహోన్నత లక్ష్యంతో కూడుకు న్న భిన్న ప్రయోజనాలు కలగలిసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. గతంలో గొల్ల, కుర్మలకు సొసైటీలు స్థాపించుకోవాలంటే అదో ప్రహసనంగా ఉండేది. అధికారులకు లంచా లు ఇచ్చుకున్నప్పటికీ సొసైటీలను ఏర్పాటు చేసుకునే వీలు లేకపోయేది. సహకార శాఖ ఆధ్వర్యం లో సొసైటీల ఏర్పాటు చేస్తుండడంతో వాటి జో లికి వెళ్లాలంటే అంతా భయపడేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గొల్ల, కుర్మల సొసైటీల ఏర్పాటు నిబంధనలను మార్చారు. చట్ట సవరణ చేసి పశు, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనే సొసైటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీంతో పారదర్శకంగా ఎలాంటి పైసా ఖర్చు లేకుండా తక్కువ సభ్యత్వ రుసుముతో సొసైటీలు జిల్లాలో పురుడు పోసుకున్నాయి. 18 సంవత్సరాలు నిండిన వారం తా ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 329 సొసైటీల్లో 20,971 సభ్యులుండగా… కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 314 సొసైటీల్లో 17,500 మంది సభ్యులున్నారు.
పక్కాగా పంపిణీ…
గొర్రెల కొనుగోలుకు తొలి విడుతలో మహారాష్ట్రలోని తొమ్మిది జిల్లాలను గుర్తించారు. నాందెడ్, గుల్బర్గా, పర్బనీ, అకోల, బుల్దాన్, జల్గావ్, జొలే, జాల్నా తదితర ప్రాంతాల్లో గొర్రెలు కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గుర్తించిన ప్రాంతాల్లోనే కొనుగోలు చేయాల్సి రావడంతో కొంత మంది దళారులు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలో గొర్రెలను కొనుగోలు చేసి, వాటిని మహారాష్ట్రకు తరలించి అక్కడి నుంచి జిల్లా లబ్ధిదారులకు అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పంపిణీ చేసిన ప్రతి గొర్రె ఫొటో తో పాటు లబ్ధిదారుల ఫొటోను ప్రత్యేకంగా రూ పొందించి తెలంగాణ జీవ సమృద్ధి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి గొర్రెకు ట్యాగ్ నంబర్ వేసి జిల్లాకు తీసుకొచ్చేలా కార్యాచరణను ప్రభుత్వం ఖరారు చేసింది. కొనుగోలు చేసిన గొర్రెలను రవాణా చేసే వాహనాలు బయలు దేరినప్పటి నుంచి అవి గ్రామాలకు చేరే వరకు జీపీఎస్ విధానం అమలు చేయాలని సర్కా రు ఆదేశాలిచ్చింది. ఇలా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమాలకు సర్కారు కళ్లెం వేసింది. ఒకవేళ లబ్ధిదారులు ఎవరైనా దళారుల వలలో చిక్కి యూనిట్లు విక్రయించుకుంటే కఠిన చర్యలకు సైతం ఆదేశాలిచ్చింది.
జాబితా సిద్ధం…
మాంసాహార మార్కెట్లో రాష్ట్రం వాటా పెరుగుతుందని ఆశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలకు తగ్గట్లుగానే పల్లెల్లో జీవాల సంపద పెరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన జీవాల విలువతో పోల్చి తే ప్రస్తుతం ప్రతి గొర్రెల యూనిట్లో 13 చొప్పు న జీవాలు పెరిగాయి. వీటి పెంపుదలతో పల్లెల్లో జీవాల సంపద సృష్టి జరిగినట్లు అర్థం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రెండో విడుత లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. నిజామాబాద్ జిల్లాలో ‘ఏ’ జాబితాలో 9631 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఇందులో 8522 మంది డీడీలు కట్టారు. వీరందరికీ ఇదివరకే గొర్రెల యూనిట్లు అందించారు. ‘బీ’ లిస్టులో 5123 డీడీ లు రాగా 1103 మందికి యూనిట్లు అందించారు. కొందరు డీడీలు వాపసు తీసుకోగా 1104 డీడీలున్నాయి. వీరందరికీ ఈ దఫా జాబితాలో యూ నిట్లు ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో ‘ఏ’ జాబితాలో 8349 యూనిట్లు, ‘బీ’ లిస్టులో 1744 మందికి యూనిట్లు అందించారు. రెండో విడుతలో 705 మంది డీడీలు కట్టిన వారుండడంతో వీరందరికీ యూనిట్లు మంజూరు కానున్నాయి. ఒక్కో గొర్రెల యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది.