సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత కష్టకాలంలో ఎవరికి ఏ అవసరం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక కొవిడ్ బాధితులతే బెడ్లు, ఇంజక్షన్లు, రక్తం, మెడిసిన్, ఆహారం ఎలా పొందాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో నేనున్నంటూ ఓ ఉద్యోగి ముందుకొస్తున్నాడు. తనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొవిడ్ రోగులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు తూముల అనిల్రావు. బాధితులకు కావాల్సిన సాయాన్ని సోషల్ మీడియా ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తెసుకెళ్తున్నాడు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. ఇలా సుమారు వంద మందికి పైగా సోషల్ మీడియా వేదికగా సాయం అందించాడు. మరీ అత్యవసరమైతే కేటీఆర్ సోషల్ మీడియా దృష్టికి తీసుకెళ్లి బాధితుల ప్రాణాలు నిలబెడుతున్నాడు. ఎలాంటి అవసరమున్నా 7702661366 నంబర్కు ఫోన్ చేయవచ్చని సూచిస్తున్నాడు.
సోషల్ మీడియాలో సమస్యలకు సంబంధించిన పోస్టులను చూసి చాలా మంది వదిలేస్తారు. కానీ అనిల్రావు అలా కాదు. సమస్యను పోస్ట్ చేసిన వ్యక్తితో మాట్లాడుతాడు. తదనంతరం సాయం చేస్తాడు. ఓ వేళ తన నుంచి కాకపోతే ఆ సమస్యను సంబంధిత శాఖకు ట్విట్టర్ ద్వారా చేరవేస్తాడు. ఫాల్ఆప్ చేస్తాడు. తనకు తెలిసిన వారికి ఆ సమస్యను ట్విట్ చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. ఇప్పటికీ అతడు కరోనా రోగుల కోసం కావాల్సిన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. అంతేకాక కరోనా చికిత్స కోసం నగరానికి వచ్చే వారు ఆకలితో అలమటించకుండా ఆహారం అందించే బాధ్యతను అనిల్రావు తీసుకున్నారు.
మా దగ్గరి బంధువులు కరోనా సమయంలో ఎదుర్కొన్న ఘటనలు నన్ను కలిచి వేశాయి. సేవా కార్యక్రమాల వైపు నడిచేలా చేశాయి. కొవిడ్ సమయంలో సాయం కోసం అర్థించే వారికి అండగా నిలువడం గొప్ప విషయం. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని సమస్యలను పరిష్కరిస్తున్నా. నా నుంచి కాని వాటిని ఇటు మంత్రి కేటీఆర్.. అటు టీఆర్ఎస్ నాయకుడు జగన్ నాకు అండగా నిలుస్తున్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. సమయంతో సంబంధం లేకుండా ట్విట్ చేసిన సమస్యలను పరిష్కరిస్తున్న కేటీఆర్ టీంకు అభినందనలు.
-అనిల్రావు, ఉద్యోగి