జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటన
క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటల పరిశీలన
చెలకల్లోనే కూర్చొని రైతులతో మాట్లాడి భరోసా నింపిన మంత్రులు
సర్వే ఆధారంగా పరిహారం చెల్లిస్తామని హామీ
అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం..
తెలంగాణలో రైతులకు కష్టాలు ఉండవు : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
కేంద్రం విధానాలతో రైతులకు అన్యాయం
అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచింది దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పరకాల/నడికూడ/నర్సంపేట రూరల్/రేగొండ : ఆరుగాలం కష్టపడి చేతికొచ్చే దశలో పంటను కోల్పోయిన రైతులను ఓదార్చి.. ఆదుకుంటామని ప్రజాప్రతినిధులు అభయమిచ్చారు. ఈ నెల 11నుంచి కురిసిన భారీ వర్షాలు, వడగండ్లతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన మిర్చి, మక్క, కూరగాయల పంటలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు పల్లా, పోచంపల్లి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన అమాత్యులు, స్వయంగా రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకొని పరిహారం చెల్లిస్తామని..అధైర్యపడొద్దని భరోసానిచ్చారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న మిరప, మక్క, కూరగాయల తోటలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర ఆధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట , మహబూబాబాద్ ఎమ్మెల్యేలు, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, బానోత్ శంకర్నాయక్, వరంగల్ జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్వోతి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, కలెక్టర్లు భవేశ్ మిశ్రా, రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి, వ్యవసాయాధికారులు మంగళవారం పరిశీలించారు. ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నాపురంలో రైతులు కూనూరి బాపురావు, పల్లెబోయిన పాణికి చెందిన మిర్చితోటలను చూశారు. ఏయే పంటలు సాగు చేశారు? ఎంత మేరకు నష్టపోయారనే అంశాలను నేరుగా రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. అక్కడి నుంచి హనుమకొండ జిల్లా పరకాల మండలానికి చేరుకొని నాగారం, మల్లక్కపేట, నడికూడలో పంటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. తర్వాత నడికూడ మండలం పులిగిల్ల రోడ్డులోనూ పంటలను చూసి కౌలు రైతులతో మాట్లాడి అభయమిచ్చారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని బాగు చేసుకుని రెండెకరాలకు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మిరప వేస్తే వడగండ్ల పాలైందని, మీరే ఆదుకోవాలని రైతు తోర్నా అనిల్ వేడుకోగా అతడికి మంత్రులు, ఎమ్మెల్యేలు ధైర్యం చెప్పారు. అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పలతండాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతు ధరావత్ యాకమ్మ చెల్కలో నేలపైనే కూర్చొని అన్నదాతలకు మనోధైర్యాన్ని కల్పించారు. తొలుత యాకమ్మ, ఆ తర్వాత ఆకులతండాకు చెందిన ధరావత్ ఈర్య, దామెర రవి, నర్సింగాపురానికి చెందిన ఈర్ల నర్సింహరాములుతో మాట్లాడించి నష్టాన్ని తెలుసుకున్నారు.
ఫసల్ బీమాతో కంపెనీలకే మేలు
నర్సంపేట, జనవరి18 : కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రధానమంత్రి ఫసల్ బీమా చేసి ఉంటే నష్టం జరుగకపోయి ఉండేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారులు దీనిపై పూర్తిగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిజరంజన్ రెడ్డి అన్నారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సొమ్మును కంపెనీలకు చెల్లించాయని, దీనివల్ల కంపెనీలకే రూ.400కోట్ల మేరకు మేలు జరిగిందని, రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు అవగాహన లేక మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫసల్ బీమాలో రైతు వాటా, రాష్ట్ర, కేంద్ర వాటా ఉంటుందని, ఏదైనా విపత్తు సమయంలో ఏరియాలో 40శాతం నష్టం జరిగితేనే రైతులకు డబ్బులు వస్తాయని చెప్పారు. బీమా సంస్థలకు మనం చెల్లించింది, బీమా సంస్థలు రైతులకు చెల్లించింది పోను బీమా సంస్థలకే అదనంగా రూ.400 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. అందుకే వివిధ రాష్ర్టాలు ఫసల్ బీమా నుంచి బయటకు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ కూడా బయటకు వచ్చిందన్నారు. దీనిపై రైతులకు వివరంగా తెలియజేయాలని వ్యవసాయాధికారులను కోరారు. జరిగిన నష్టంపై ప్రత్యేకంగా సర్వే చేసి నివేదికలను సకాలంలో అందించేలా చూడాలని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
రైతుల నడ్డి విరుస్తున్న కేంద్రం
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం రైతు వ్యతిరేక విధానాలతో నడ్డి విరుస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తూ నిరంతరం రైతుల గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు రైతులకు సాయం చేసింది, చేస్తున్నది, భవిష్యత్లో చేసేది కూడా సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. పంటలు చేదికందే సమయంలో అకాల వర్షాలు కురిసి నేలపాలు కావడం బాధ కలిగించిందన్నారు. పంట నష్టంపై జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్కు వివరించగానే ఆయన చలించిపోయారని, వెంటనే రైతులను కలిసి భరోసా కల్పించాలని ఆదేశించారని చెప్పారు. ఇక్కడి పరిస్థితులను పూర్తిగా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న మారాజని, ప్రతి రైతుకు తప్పక న్యాయం చేస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 40వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, ఒక్క నర్సంపేట డివిజన్లోనే 25వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని చూస్తుంటే కేంద్రం ఎరువుల ధరలు పెంచి రైతులపై ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. కేంద్ర పాలకుల అసంబద్ధ విధానాలతోనే రైతులకు న్యాయం జరుగడం లేదని, కేంద్ర వ్యవసాయ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని మండిపడ్డారు. రేగొండలో మంత్రుల వెంట అడిషనల్ కలెక్టర్ దివాకర, జయశంకర్ జిల్లా ఉద్యాన శాఖ ఆధికారి అక్బర్, మండల వ్యవసాయాధికారి వాసుదేవారెడ్డి, ఎంపీడీవో సురేందర్గౌడ్, తహసీల్దార్ జీవాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంకం రాజేందర్. ఆలయ చైర్మన్ ఇంగె మహేందర్, సర్పంచ్లు దేవునూరి ప్రణతి, నడిపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఐలి శ్రీధర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మైస భిక్షపతి, కేసిరెడ్డి ప్రతాప్రెడ్డి ఉన్నారు. పరకాలలో హనుమకొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాల్, రైతుబంధు జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, సిలువేరు మొగిలి, కోడెపాక సుమలత, మచ్చ అనసూర్య చింతిరెడ్డి మధుసూదన్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్లు గుండెబోయిన నాగయ్య, నల్లెల్ల లింగమూర్తి, నడికూడలో ఎంపీపీ మచ్చ అనసూర్య-రవీందర్, జడ్పీటీసీ కొడెపాక సుమలత కరుణాకర్, సర్పంచులు ఊర రవీందర్ రావు, తిప్పర్తి సాంబశివారెడ్డి, గూడెం కృష్ణమూర్తి, చాడ తిరుపతి రెడ్డి, పాలకుర్తి సదానందం, మేకల రమేశ్, బొట్ల సంధ్య రవి, గోల్కొండ ఉమా సదానందం, రావుల రాజిరెడ్డి, భోగి శ్రీలత రవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, కార్యదర్శి నందికొండ గణపతిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, మండల కో ఆర్డినేటర్ సుధాటి వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి, డైరెక్టర్ ఊర సతీశ్రావు, నందికొండ జైపాల్ రెడ్డి, కోడెపాక కరుణాకర్, కిన్నెర రవి, తోర్న అనిల్, గుండ్ర రాజు, గోనెల కుమారస్వామి, జగన్నాథపు రమేశ్, నర్సంపేటలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, డీపీవో స్వరూప, డీఆర్డీవో సంపత్రావు, డీఎల్పీవో వెంకటేశ్వర్లు ఉన్నారు.
మీకు మేమున్నాం.. అధైర్యపడొద్దు..
వడగండ్లతో పంట నష్టపోయిన రైతులు ఏమాత్రం అధైర్యపడొద్దని, ప్రతి రైతుకూ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి భరోసానిచ్చారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన ఆయా చోట్ల మాట్లాడుతూ రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది దేశంలో సీఎం కేసీఆర్ సర్కారు ఒక్కటేనని స్పష్టం చేశారు. వడగండ్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, మంథని నియోజకవర్గాల్లో పంటలు దెబ్బతిన్నాయని, చేతికొచ్చే సమయంలో రైతులకు జరిగిన నష్టం తమకు ఆవేదన కలిగించిందన్నారు. తాము కూడా రైతు కుటుంబం నుంచే వచ్చామని, రైతుల బాధలు తమకు తెలుసునని పేర్కొన్నారు. పంటలను పరిశీలించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తానన్నారని, కానీ అనివార్య కారణాల వల్ల రాలేక పోయారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకే తాము పంటలను పరిశీలించినట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద నిర్ధిష్ట ప్రణాళిక అంటూ ఏదీ లేదని విమర్శించారు. రాష్ర్టాల చేతిలో కూడా పూర్తి అధికారాలు లేకుండా పోయాయని ఆవేదన చెందారు. ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేసి కేంద్రానికి పంపిస్తే సరైన సమయంలో స్పందిచడం లేదని మండిపడ్డారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికలు గ్రామాల వారీగా పంచాయతీల్లో నోటీస్ బోర్డుపై పెట్టాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కూలీల కొరత వల్ల వ్యవసాయానికి ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ ఆనాడే పార్లమెంట్లో ఎంపీ వినోద్కుమార్తో మాట్లాడించారని మంత్రి గుర్తుచేశారు.