రెండు సంవత్సరాలుగా తప్పుడు లెక్కలు
సూపర్వైజర్తో పాటు పలువురి పాత్రపై అనుమానాలు
ఆడియో రికార్డులతో వ్యవహారం వెలుగులోకి..
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 29 (నమస్తేతెలంగాణ) : జిల్లాలోని మరో కాటన్ మిల్లులో నిధుల గోల్మాల్ వ్యవహారం వెలుగుచూసింది. గత సంవత్సరం చిట్యాల మండలంలోని పత్తి మిల్లులో నిధుల గోల్మాల్ జరుగగా ప్రస్తుతం గణపురం మండలంలోని థౌజండ్ క్వార్టర్స్ సమీపంలోని ఎంఎస్ఆర్ కాటన్ జిన్నింగ్ మిల్లులో రూ. 3.5 కోట్ల నిధుల గోల్మాల్ జరిగినట్లు సమాచారం. మిల్లులో రెండు సంవత్సరాలుగా సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి, సంబంధిత మార్కెంటింగ్ శాఖ ఉద్యోగులతో కలిసి సొమ్ము కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిల్లుకు వచ్చిన వాహనాన్ని వేబ్రిడ్జిపై తూకం వేసి జారీ చేసిన వేబిల్లు ద్వారా రెండు వాహనాలు వచ్చినట్లు చూపి తమకు తెలిసిన రైతులు, కుటుంబ సభ్యుల ఖాతాల్లో సూపర్వైజర్ డబ్బులు జమ చేయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, వరంగల్ రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
రెండు సంవత్సరాలుగా..
మిల్లులో నిధుల గోల్మాల్ తతంగం రెండు సంవత్సరాలుగా సాగుతున్నట్లు సమాచారం. గత సంవత్సరం సుమారు 55 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సూపర్వైజర్తో పాటు మార్కెట్ ఉద్యోగులు కలిసి 4 వేల క్వింటాళ్ల వరకు తప్పుడు లెక్కలు చూపించారని తెలుస్తున్నది. ఈ సంవత్సరం సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తి రాగా 3 వేల క్వింటాళ్ల వరకు తప్పుడు లెక్కలు చూపించినట్లు సమాచారం. యాజమాన్యం లెక్కల ప్రకారం గత సంవత్సరం రూ. 2 కోట్లు, ఈ సంవత్సరం రూ. 1.5 కోట్లు కాజేసినట్లు తెలుస్తున్నది. నకిలీ వేబిల్లులు సృష్టించి అదనంగా బిల్లులు రికార్డు చేయడం వల్లే తమకు నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, మిల్లులో జరుగుతున్న గోల్మాల్ వ్యవహారం, నిధుల కాజేత వంటి అంశాలపై సదరు సూపర్వైజర్ మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్లను యాజమాన్యం సేకరించినట్లు తెలుస్తున్నది. కాగా, గోల్మాల్ వ్యవహారంపై స్థానిక సీఐని వివరణ కోరగా తమకు లిఖిత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.