అమలైతే అన్నదాతను మ్యూజియంలో చూడాల్సి వస్తుంది
‘రైతన్న’ సినిమాను విజయవంతం చేయండి..
సినీనటుడు ఆర్ నారాయణమూర్తి
జనగామ, అక్టోబర్20 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా సినీనటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన ‘రైతన్న’ సినిమాను విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం నారాయణమూర్తి జనగామలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ముత్తిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాను రూపొందించిన రైతన్న సినిమా విజయవంతమయ్యేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 23న ఉదయం 10గంటలకు జనగామలో రైతన్న సినిమాను తాను స్వయంగా థియేటర్కు వెళ్లి చూ స్తానన్నారు. రైతుల కష్టాలను కళ్లకట్టినట్లు తెరకెక్కించిన నారాయణమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. తనతోపాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు థియేటర్కు వచ్చి రైతన్న సినిమా చూడాలని విజ్ఞప్తి చేశారు.
నల్లచట్టాలు రైతులకు శాపమని, అవి అమలైతే అన్నదాతలను మ్యూజియంలోనే చూడాల్సి వస్తుందని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లా కేంద్రం మూడుకొట్ల సెంటర్లోని సీపీఐ వీరభవన్లో, నర్సంపేటలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే దేశంలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు నష్టం చేకూరుతుందన్నారు. ఇప్పుడు మనం జంతు ప్రదర్శన శాలలో అదిగో పులి అని చూస్తున్నామని, అదే పరిస్థితి రైతుకు వస్తుందన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని తొమ్మిది నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని, 600 మంది బలిదానాలు చేసుకున్నారని, ప్రధాని మోదీ పట్టించుకోక పోవడం దారుణమన్నారు. రైల్వేలు, వ్యవసాయం, ఎల్ఐసీ, విద్య, తదితర శాఖలను ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా మీటర్లు పెడితే తెలంగాణలో 24 గంటల ఉచిత కరంటు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుందన్నారు. 2006 నుంచి బీహార్ రాష్ట్రంలో ఒకే ప్రాంతం, ఒకే విధానం అమలు చేస్తున్నారని, దీనివల్ల అక్కడి రైతులు కూలీలుగా మారారన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయాలని కోరారు. పంటలకు మద్దతు ధర అందించాలన్నారు. ప్రస్తుతం సీసీఐ, ఎఫ్సీఐ ఇస్తున్న ధరలు సరిపోవన్నారు. మోదీ దిగొచ్చే వరకు రైతులు సమష్టిగా పోరాటాలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం స్వావధాన్ కమిటీని తీసుకొచ్చి మధ్యలోనే వదిలివెళ్లిందన్నారు. కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజి ల్ ధరలను అమాంతం పెంచి నిరుపేదల నడ్డి విరుస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. విభిన్న జాతులతో భారతదేశం విలసిల్లినట్లుగానే మానుకోట విలసిల్లుతున్నదన్నారు. మానుకోటకు సమస్య వచ్చిందంటే అన్ని కులాలు, మతాల వారు ముందుండి పరిష్కరించుకుంటారని అన్నారు. మహబూబాబాద్లో సీపీఐ జిల్లా కార్యదర్శి బామనపల్లి విజయసారధి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, ఎన్డీ పార్టీ నాయకులు మండల వెంకన్న, దేశెట్టి రాంచంద్రయ్య, నర్సంపేటలో వామపక్షాల నాయకులు పంజాల రమేశ్, హన్మకొండ శ్రీధర్, భూక్యా సమ్మయ్య, రాజేందర్, సాంబయ్యగౌడ్, రాజు పాల్గొన్నారు.