జిల్లా దవాఖాన అభివృద్ధి సమావేశంలో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి
తాండూరు, జూలై 12: తెలంగాణ సర్కార్ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నదని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. సోమవారం తాండూరు ప్రభుత్వ జిల్లా దవాఖానలో అభివృద్ధి సమావేశం నిర్వహించారు. దవాఖాన అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ రూ.70 లక్షల జడ్పీ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించామని, మిగతా సౌకర్యాలకు కావాల్సిన నిధులు విడుదల చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న తాండూరు దవాఖానలో త్వరలో సిటీస్కాన్తో పాటు రోగులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రసూతీ చికిత్సలో వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వైద్యులు నిర్లక్ష్యం చేయకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. తమకు సమాచారం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, అందుకు తగ్గట్లు వైద్యులు నడుచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ జిల్లా దవాఖానకు అంబులెన్స్ డ్రైవర్లతో పాటు నర్సు, ఇతర వైద్య సిబ్బంది మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రూ.2 కోట్లతో సిటీ స్కాన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దవాఖానలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటుపై టెండర్లు వేయనున్నట్లు తెలిపారు. దవాఖానకు మంజూరైన నిధులు, ఖర్చుల వివరాల రిజిస్టర్లు పెట్టాలన్నారు. బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, సూపరింటెండెంట్ మల్లికార్జున్, జడ్పీటీసీలు, వైద్యులు పాల్గొన్నారు.