న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో(ఎస్బీఐ) ఖాతా ఉందా.. కేవైసీని అప్డేట్ చేసుకోండంటూ ఏదైనా లింక్తో కూడిన మెసేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త. తొందరపడి లింక్పై క్లిక్ చేయకండి. ఖాతాల్లో ఉన్న డబ్బు మొత్తం మాయమైపోవచ్చు. ఎస్బీఐ ఖాతాదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవైసీ పేరుతో వ్యక్తిగత, బ్యాంకు ఖాతా సమాచారం అడిగి డబ్బు కొల్లగొడుతున్నారు. ఢిల్లీకి చెందిన సైబర్పీస్ ఫౌండేషన్, ఇన్ఫోసెక్ సంస్థలు ఈ నేరాలను బయటపెట్టాయి. చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపాయి. ఇలాంటి మెసేజ్లే కాకుండా బహుమతుల పేరుతో కూడా మోసం చేస్తున్నట్టు వెల్లడించాయి. తొలుత కేవైసీ అప్డేట్ అంటూ ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ వస్తుంది. ఈ సందేశంలో ఓ లింక్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే అచ్చం ఎస్బీఐ వెబ్పేజీలా ఉండే నకిలీ పేజీ ఓపెన్ అవుతుంది. వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతారు. తర్వాత ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక సైబర్ నేరగాళ్లు అదే ఓటీపీతో ఖాతాలో డబ్బు కొల్లగొడతారు.
క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
ఇలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ క్రైం పోలీసులు ఈ జాగ్రత్తలు చెప్తున్నారు. మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సెర్చ్ బాక్స్ మొదట్లో ‘https://’ అని లేదా ‘http://’ అని గమనించవచ్చు. https అని ఉంటే మాత్రమే అది సురక్షితం. చివర్లో ఎస్(సెక్యూర్)అని లేకపోతే అది సురక్షితం కాదు. మన వివరాలు మనం వాడుతున్న కంపెనీ వెబ్సైట్ కాకుండా మూడో వ్యక్తి సేకరించే ప్రమాదం ఉంటుంది.