కంటోన్మెంట్/మారెడ్పల్లి, మార్చి 12: ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించని ప్రతిపక్షాలకు పట్టభద్రులను ఓటు అడిగే హక్కులేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శుక్రవారం కార్ఖానాలోని క్యాంపు కార్యాలయంలో ఇన్చార్జీలు, ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు బొల్లారంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రం సాధించుకున్న ఆరేళ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం 1.32 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిందని, త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్యప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ మాయమాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే సాయన్న కోరారు. ఉద్యోగులను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు తిప్పికొట్టాలని సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఎమ్మెల్యేలు సాయన్న, రసమయి బాలకిషన్ శుక్రవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విద్యారంగంలో సైతం వివక్ష చూపుతుందన్నారు. విద్యావంతులంతా ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల వైఖరిని గమనించాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథం, నేతలు నివేదిత, సదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో జీహెచ్ఎంసీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహాముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు అశోక్, సందీప్, చంద్రకుమార్, రాంమోహన్ తదితరులు పట్టభద్రుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ…వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.