న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 6 రోజుల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. గురువారం ఒక్కరోజే 23,285 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం గత 78 రోజుల్లో ఇదే తొలిసారి. గురువారం కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,13,08,846కు చేరుకున్నది. వీరిలో 1,09,53,303 మంది కోలుకున్నారు. 1,97,237 మంది చికిత్స పొంతున్నారు. కరోనాతో గురువారం 117 మంది మరణించడంతో మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. దేశంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. గురువారం ఆ రాష్ట్రంలో 15,817 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడానికి కారణం జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలేనని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారం, అనంతరం విజయోత్సవ ర్యాలీల్లో నాయకులు, ప్రజలు కరోనా నిబంధనలు పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంటున్నారు. పుణెలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బడులు, కాలేజీలను ఈ నెల 31దాకా మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
టీకాను తమ దేశానికే పరిమితం చేసుకునే ‘వ్యాక్సిన్ జాతీయవాదం’ పెరుగుతున్నదని, వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో ధనిక దేశాలు చాటుగా ఒప్పందాలు చేసుకొంటున్నాయని ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరస్ విమర్శించారు. ఫలితంగా అనేక పేద దేశాలు కనీసం ఒక్కడోసు టీకాను కూడా పొందలేకపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ మన నైతికతను పరీక్షిస్తున్నదని అన్నారు.