ప్రభుత్వ గురుకులాలు, విద్యాసంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయా నియోజకవర్గ విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతినెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం సంకల్పించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో సిమోన్ వాంగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్తో పాటు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, వివరాలను వాంగ్కు కేటీఆర్ అందించారు.
ఎస్టీ జాబితాలో నుంచి లంబాడాలను తొలగిస్తామని చెప్పి.. ఆదివాసీలను మోసగిస్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సమావేశమైన నాయకులు ఎంపీ తీరును తప్పుపట్టారు.
మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే మీ సేవ, హాక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఫోన్లు రికవరీ చేసిన అనంతరం వెంటనే బాధితులకు సమాచారం అందిస్తామని తెలిపారు. పాతబస్తీ పరిధిలో చోరీకి గురైన 66 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 767 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి తాజాగా 848 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 2567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనా సోకిన తొలి పేషెంట్కు మళ్లీ అదే వైరస్ బారిన పడింది. చైనాలోని మెడికల్ కాలేజ్లో చదువుతున్న కేరళలోని త్రిసూర్కు చెందిన విద్యార్థిని దేశంలో తొలి కరోనా పేషెంట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమెకు తాజాగా మరోసారి పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య అధికారి వెల్లడించారు. అయితే ఆమెకు లక్షణాలేమీ లేవని చెప్పారు.
కరోనా థర్డ్ వేవ్ విజృంభించకుండా ఆపాలంటే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు కరోనా నిబంధనలను సరిగా పాటించడంలేదని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. హిల్ స్టేషన్స్కు వచ్చే పర్యాటకులలో చాలా మంది ఫేస్ మాస్కులు ధరించడంలేదని, సామాజిక దూరం కూడా పాటించడం లేదని అన్నారు.
ఇరాక్లోని నస్రియా అల్ – హుస్సేన్ ఆస్పత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కరోనా వార్డులో చికిత్స పొందుతున్న 52 మంది రోగులు మృతి చెందారు. మరో 13 మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కరోనా వార్డు 70 పడకలతో 3 నెలల క్రితమే ప్రారంభమైంది.
మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ (66) ఇవాళ గుండెపోటుతో కన్నుమూశారు. కపిల్దేవ్ సారథ్యంలో 1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో యశ్పాల్ సభ్యుడిగా ఉన్నాడు. 83 వరల్డ్కప్ ఆడిన సభ్యుల్లో.. మరణించిన తొలి క్రికెటర్ యశ్పాల్ శర్మ కావడం విషాదకరం. యశ్పాల్ మృతి బాధాకరం అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. 83 వరల్డ్ కప్లో అతని ప్రదర్శన అసాధారణమన్నారు.
ఇండియా మరోసారి వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్కు వేదిక కానుంది. ఈ మెగా టోర్నీని 2026లో ఇండియాలో నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ మంగళవారం వెల్లడించింది. తొలిసారి 2009లో హైదరాబాద్ వేదికగా ఈ చాంపియన్షిప్ జరిగింది.