కలెక్టర్ రవి
బక్రీద్ పండుగపై ముస్లిం మతపెద్దలు, అధికారులతో సమావేశం
జగిత్యాల కలెక్టరేట్, జూలై 17: బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జీ రవి అధికారులను ఆదేశించారు. రానున్న బక్రీద్ నేపథ్యంలో ముస్లిం మతపెద్దలు, మున్సిపల్, పంచాయతీ, పోలీస్ అధికారులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈనెల 21 న బక్రీద్కు వెటర్నరీ అధికారులు ధ్రువీకరరించిన జంతువులను మాత్రమే వినియోగించాలన్నారు. పండుగ కోసం వాహనాల్లో తరలించే జంతువులకు అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే పోస్టులపై నిర్ధారణ చేసుకోవాలని, ఎవరూ తొందరపడవద్దని అధికారులకు సూచించారు. కబేలాల నిర్వాహకులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పండుగ ముగిసే వరకు మున్సిపల్, పంచాయతీ అధికారులు పారిశుధ్య కార్మికులతో ప్రత్యేక కార్యక్రమా లు చేపట్టాలన్నారు.
జిల్లాలో సబ్ డివిజనల్ అధికారులు పర్యవేక్షిస్తారని, ఎక్కడ ఏ ఫిర్యాదు వచ్చినా తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ, ఏ జంతువులను కొనుగోలు చేయాలి..? ఏ వాహనంలో ఎన్ని జంతువులను తరలించాలి..? అనే విషయాన్ని కొనుగోలు చేసే ప్రాంతంలోనే నిర్ధ్దారించుకొని వెటర్నరీ అధికారులతో ధ్రువీకరణ పత్రం పొందాలని చెప్పారు. జంతువులను కొనుగోలు చేసే ప్రాంతాల్లో సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తామని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, పంచాయతీ అధికారి నరేశ్, జిల్లా మైనార్టీ అధికారి సుందర వరదరాజన్, జగిత్యాల, మెట్పెల్లి డీఎస్పీలు వెంకటరమణ, ఎండీ గౌస్ బాబా, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.