ఉమ్మడి కరీంనగర్ జిల్లా దిగ్భ్రాంతి
మంత్రులు కేటీఆర్, ఈటల, గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ సంతాపం
స్వగ్రామం వెదిరలో గ్రామస్తుల నివాళి
రాజకీయాల్లో సత్యనారాయణరావుది ప్రత్యేక స్థానం
తొలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
దేశ రాజకీయాల్లోనే తనదైన ముద్ర
ముక్కుసూటితనం ఆయన నైజం
గవర్నర్ కావాలనే కోరిక నెరవేరకుండానే కన్నుమూత
కరీంనగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :అపార రాజకీయ అనుభవం ఆయన సొంతం.. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. క్రమశిక్షణకు మారుపేరు.. ముక్కుసూటిగా మాట్లాడడం, ఏ విషయాన్నైనా కుండబద్ధలు కొట్టడం ఆయన నైజం.. అజాత శత్రువుగా, ప్రజా సమస్యలపై గళం విప్పిన నాయకుడిగా పేరొందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎం సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) ఇక లేరు. 67 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తాను కలలుగన్న ప్రత్యేక తెలంగాణ కండ్ల ముందే సిద్ధించినా.. గవర్నర్ కావాలనే కోరిక నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. కరోనా బారిన పడి నిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడువగా.. ఉమ్మడి జిల్లా దిగ్భ్రాంతి చెందింది. అభిమానలోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్తోపాటు వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మృతి నేటి సమాజానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన మేనేని హన్మంతరావు, యశోద దంపతుల రెండో కొడుకు సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్). ఆయనకు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులున్నారు. అయితే, ఎమ్మెస్సార్ తన చిన్నతనంలోనే బంధువులైన రంగారావు, మంగమ్మ ఇంటికి దత్తత వెళ్లారు. రెండు కుటుంబాల కనుసన్నల్లో విద్యాభ్యాసాన్ని సాగించారు. మూడో తరగతి వరకు గ్రామంలోనే చదివి, నాలుగు నుంచి హైస్కూల్ వరకు కరీంనగర్లోని వేర్వేరు పాఠశాలల్లో చదువుకున్నారు. కళాశాల విద్యను మాత్రం హైదరాబాద్లో పూర్తి చేశారు. ఉస్మానియా న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. హైదరాబాద్ వివేకవర్ధని కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో కాలేజీల యూత్ మ్యాగజైన్కు ఎడిటర్గా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పురుషోత్తంరెడ్డి అప్పట్లో నిర్మించిన ‘చివరకు మిగిలేది’ అనే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. డబ్బు కోసం కాకుండా పేరు కోసం మాత్రమే సినిమా తీశామని ఆనాడే ప్రకటించారు. ఎమ్మెస్సార్కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఎన్నో పదవులు..
1934 జనవరి 14న జన్మించిన ఎమ్మెస్సార్ది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. 20వ ఏటనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, ఏ పదవులు ఆశించకుండా ముందుకు సాగారు. కరీంనగర్లో న్యాయవాద వృత్తి చేస్తూనే, మరోవైపు యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. 1954 నుంచి 1969 వరకు విద్యార్థి, యువజన నాయకుడిగా కొనసాగారు. 1969 నుంచి 1971 వరకు జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి ద్వారా 1971లో కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. హ్యాట్రిక్ కొట్టినా ఆయన ఏనాడూ గర్వం చూపలేదు. మనిషీ మారలేదు. రాజకీయ విలువలను పెంచారే తప్ప దిగజారనీయలేదు. ఆ తర్వాత 1985 నుంచి 1988 వరకు సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ, హౌస్ కమిటీ, ఫిర్యాదుల కమిటీలకు నేతృత్వం వహించారు. ఇందిరాగాంధీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో.. 1980 నుంచి 1983 వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పలు రాష్ర్టాలకు ఇన్చార్జిగా కొనసాగారు. 1980 నుంచి 1999 వరకు ఇండో-అరబ్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా, పాలస్తీనా విషయంలో ఐక్య రాజ్య సమితిలో 1985 జెనీవాలో, 1986 న్యూయార్క్లో భారత బృందానికి నాయకత్వం వహించారు. కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2000 నుంచి 2004 వరకు పని చేశారు. 2004 నుంచి 2007 వరకు దేవాదాయ శాఖకు ముందుగా, ఆ తర్వాత రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖకు మంత్రిగా ఉన్నారు. 2007 డిసెంబర్ నుంచి 2014 వరకు ఆర్టీసీ చైర్మన్గా కొనసాగారు.
కోరిక తీరకుండానే..
ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించిన ఎమ్మెస్సార్కు గవర్నర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. ఈ విషయంలో ఆయన పలుసార్లు ఢిల్లీ పెద్దలను కూడా కలిశారు. అంతేకాదు, ఆయన సీనియార్టీకి, అనుభవానికి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ ఇస్తారని అందరూ ఆశించారు. గవర్నర్ కావాలనే కోరిక ఉందంటూ స్వయంగా ఎమ్మెస్సారే 2008లో కరీంనగర్లో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గవర్నర్ పదవిని కోరుకుంటున్నారా..?’ అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అన్ని అర్హతలున్నాయి కాబట్టే అడుగుతున్నానని నిర్మొహమాటంగా చెప్పారు. ‘గవర్నర్ ఇస్తే తెలంగాణ వాదాన్ని పక్కకు పెడుతారా..?’ అన్న ప్రశ్నకు ఆయన దాచుకోకుండా సమాధానం చెప్పారు. రాజ్భవన్లో ఉండడం అంటే ఖైదీ అ యినట్లే! మాట్లాడేందుకు స్వే చ్ఛ ఉండదు కదా! అని చెప్పా రు. రాజ్భవన్కు బదులు బస్సుభవన్లో ఉన్నాను అంటూ కొంత నిర్వేదం కూడా వ్యక్తం చేశారు. ఆయన కోరుకున్న తెలంగాణ ఆయన కళ్లేముందే సిద్ధించినా.. గవర్నర్ కావాలనే కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోవడం అందరినీ కలిచివేసింది.
త్వరలో ప్రసంగాల పుస్తకం
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెస్సార్. ఆయన కరీంనగర్ ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్గా ప్రత్యేకతను చాటుకున్నారు. ముక్కుసూటి మనిషిగా నిలిచారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నా. ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. ఎమ్మెస్సార్ కరీంనగర్ ఎంపీగా ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం సహా అనేక సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, వివిధ అంశాలపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. పార్లమెంట్లో ఎమ్మెస్సార్ ప్రసంగాలను స్వయంగా సేకరించి వారి కుటుంబ సభ్యులకు అందించా. ఆ ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పుస్తకం వెలువడే సమయంలో ఎమ్మెస్సార్ దూరం కావడం మమ్మల్ని కలిచివేసింది.