Houthi Rebels: యెమెన్ (Yemen) దేశాన్ని హస్తగతం చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) మళ్లీ రెచ్చిపోయారు. ఎర్ర సముద్రం (Red Sea) లో నార్వే జెండాతో ఉన్న ఓ రవాణా నౌక (Cargo ship) పై క్షిపణి దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
దాడికి గురైన నౌక మలేసియా నుంచి పామాయిల్, ఇతర వాణిజ్య సరుకులతో ఇటలీకి బయల్దేరింది. ఎర్ర సముద్రం మీదుగా వెళ్తూ మరికొద్ది గంటల్లో సూయజ్ కాలువలోకి ప్రవేశించాల్సి ఉండగా బాబ్ ఇల్-మందేబ్ జలసంధి వద్ద నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ జలసంధి యెమెన్, జిబోటి మధ్యలో ఉంటుంది. యెమెన్ నుంచి ఈ క్షిపణి దాడి జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా, క్షిపణి దాడితో నౌకలో పామాయిల్ ట్యాంకర్ పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. దాంతో అటు సమీపంలో ఉన్న అమెరికా నౌక అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే క్షిపణి దాడి నుంచి నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ప్రస్తుతం నౌక సురక్షిత పోర్టుకు బయల్దేరిందని నౌక నిర్వాహక సంస్థ వెల్లడించింది.
అయితే, ఇటీవల కాలంలో హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్, క్షిపణి దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ (Israel) కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలు లేదా ఇజ్రాయెల్తో సంబంధమున్న నౌకలను తాము లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇటీవల హౌతీ రెబల్స్ ప్రకటించారు. ఇప్పటికే భారత్కు వస్తున్న ఓ నౌకను హైజాక్ చేయడంతో పాటు.. ఫ్రాన్స్ యుద్ధ నౌకపైకి డ్రోన్లను పంపించారు.
పాలస్తీనా పోరాటానికి మద్దతుగా ఇజ్రాయెల్పై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని హౌతీ తిరుగుబాటుదారులు హెచ్చరించారు. అయితే తాజా ఘటనలో నార్వే నౌకకు ఇజ్రాయెల్తో ఏం సంబంధం ఉందనేది తెలియాల్సి ఉంది.