తప్పుడు కేసులో ఇరుక్కొని జైలుపాలైన ఒక వ్యక్తి 16 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాడు. ఇంతకాలం తర్వాత నిర్దోషి అని తేలడంతో అతన్ని విడుదల చేశారు. ఈ క్రమంలో అతన్ని దోషిగా గుర్తించిన అప్పటి బాధితురాలు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్లో వెలుగు చూసింది.
ప్రముఖ రచయిత్రి అలైస్ సెబాల్డ్ యుక్తవయసులో ఉండగా, ఆమెను ఒక వ్యక్తి బలాత్కరించాడు. ఈ కేసు విచారణలో ఆంథనీ బ్రాడ్వాటర్ అనే వ్యక్తిని నిందితుడిగా పోలీసులు భావించారు. అలైస్ కూడా అతన్నే దోషిగా గుర్తించింది. దీంతో అతనికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
ఈ కేసుపై మరోసారి విచారణ చేయగా ఆంథనీని దోషిగా తేల్చే బలమైన ఆధారాలేవీ దొరకలేదని తేలింది. కేవలం అలైస్ మాటలు, అలాగే ప్రస్తుతం అమల్లో లేని వెంట్రుకల మైక్రోస్కోపిక్ విశ్లేషణ ఆధారంగానే ఆంథనీని ముద్దాయిగా తేల్చారని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.
దీంతో ఆంథనీకి క్షమాపణలు చెప్తూ అలైస్ ఒక లేఖ రాసింది. ఆ సమయంలో తాను పొరపడ్డానని, అమెరికా న్యాయవ్యవస్థపై నమ్మకముంచానని పేర్కొంది. అలాగే తన కారణంగా ఆంథనీ చాలా జీవితం కోల్పోయినందుకు చాలా చింతిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆమె ఎదుర్కొన్న అనుభవాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఆమె చేసింది తప్పేనని ఆంథనీ అన్నారు.