టెహ్రాన్: ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా పేరుగాంచిన 94 ఏళ్ల వృద్ధుడు ఇటీవల మరణించాడు. ఆయన సుమారు 60 ఏళ్లుగా స్నానం చేయలేదు. ఇరాన్కు చెందిన ఆ వృద్ధుడు చిన్నతనంలో ఎదుర్కొన్న ఒక రకమైన భయం వల్ల ఏళ్ల పాటు శరీర శుభ్రతకు దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఫార్స్ దక్షిణ ప్రాంతంలోని దేజ్గా గ్రామానికి చెందిన అమౌ హాజీ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా ప్రసిద్ధి చెందాడు. గత 60 ఏళ్లుగా నీటితో లేదా సబ్బుతో స్నానం చేయకపోవడమే దీనికి కారణం. దీంతో ఒంటి నిండా పేరుకుపోయిన మురికి, మాసిన గెడ్డం, అపరిశుభ్రతతో కూడిన ఆయన గ్రామంలోని చిన్న ఇటుక గుడిసెలో నివసిస్తున్నాడు.
కాగా, కొన్ని నెలల కిందట స్థానికులు గట్టిగా పట్టుబట్టి ఒప్పించడంతో అమౌ హాజీ చాలా ఏళ్ల తర్వాత తొలిసారి స్నానం చేశాడు. అయితే నాటి నుంచి ఆ వృద్ధుడు తీవ్ర విచారంతో ఉన్నాడు. శరీర శుభ్రత వల్ల తనకు అనారోగ్యం వాటిల్లుతుందని భయాందోళన చెందాడు. ఈ నేపథ్యంలో 94 ఏళ్ల వయసులో గత వారం మరణించాడు.
మరోవైపు స్నానం చేయకపోవడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడానికి ఒక రకమైన భయం కారణమని వైద్య నిఫుణులు తెలిపారు. అలాంటి భయాలను ‘అబ్లుటోఫోబియా’ అని అంటారని చెప్పారు. ఇది ఒక నిర్దిష్టమైన ఫోబియా అని వెల్లడించారు. ఈ భయం అనేది ఆందోళన కలిగించే రుగ్మతగా పేర్కొన్నారు. ఈ భయం గురించి ఇంకా పూర్తిగా అర్థం కాలేదని వెల్లడించారు.
అయితే గతంలో స్నానం చేయడం వల్ల లేదా శరీర శుభ్రత సందర్భంగా ఎదురైన ప్రతికూల అనుభవం లేదా బాధాకరమైన సంఘటన కారణంగా ఈ భయానికి గురవుతారని మానసిక వైద్యులు తెలిపారు. బ్రిటీష్ కొలంబియాలోని యాంగ్జయిటీ డిజార్డర్స్ అసోసియేషన్ ప్రకారం, పెద్ద వారి కంటే 7-11 ఏళ్లలోపు పిల్లలను ఈ ఫోబియా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ఒక అధ్యయనం ద్వారా తెలిసిందన్నారు.