స్కూళ్లకు వెళ్లకుండా ఆడపిల్లలపై నిషేధం విధించిన తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు గట్టి షాకిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ రీకన్స్ట్రక్షన్ ట్రస్ట్ ఫండ్ (ఏఆర్టీఎఫ్) కింద ఆఫ్ఘన్ గడ్డపై చేపట్టాల్సిన 600 మిలియన్ డాలర్ల పనులను నిలిపివేసింది. అమెరికా బలగాలు ఆఫ్ఘన్ను వీడిన తర్వాత తాలిబన్లు ఇక్కడ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రపంచ బ్యంకు సహా అన్ని అంతర్జాతీయ సంస్థలు ఆప్ఘన్ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ఫ్రీజ్ చేశాయి. అయితే వ్యవసాయం, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో కీలకమైన ప్రాజెక్టులకు సపోర్ట్ ఇచ్చేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన పలువిభాగాలు ఏఆర్టీఎఫ్కు కొత్త రూపం ఇచ్చాయి.
అయితే ఈ ఏఆర్టీఎఫ్ ద్వారా మహిళలు, ఆడపిల్లలకు కూడా సమానంగా లబ్ది పొందాలనేది ప్రపంచ బ్యాంకు నిబంధన. ఇలాంటి సమంయలో ఏడో గ్రేడ్ నుంచి అమ్మాయిలను స్కూళ్లకు పంపించకూడదని తాలిబన్ ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ప్రపంచ బ్యాంకు ఆగ్రహించినట్లు సమాచారం. నిబంధనలు పాటించలేదనే కారణంతో ఏఆర్టీఎఫ్ నిధులను మంజూరు చేయకుండా ఆపేసింది.
ఆఫ్ఘన్లోని పరిస్థితులపై ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ భాగస్వాములు పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులను ఏఆర్టీఎఫ్కు అందజేస్తామని ప్రపంచ బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. అమ్మాయిల విద్యపై తాలిబన్లు నిషేధం విధించిన నేపథ్యంలో.. దోహాలో తాలిబన్ నేతలతో మీటింగ్ను అమెరికా అధికారులు రద్దు చేసుకున్నారు. అయితే వచ్చే నెల నుంచి అమ్మాయిలను స్కూళ్లలోకి అనుమతిస్తామని తాలిబన్ లీడర్లు చెప్తున్నారు.