నాడు కరువు ప్రభావంతో పశువుల విక్రయం
నేడు కాళేశ్వరం నీళ్లతో మారిన పరిణామం
మూగజీవాలతో కళకళలాడుతున్న పల్లెలు
రెట్టింపైన గొర్రెలు, బర్రెలు, కోళ్ల సంఖ్య
వ్యవసాయం ఉన్న చోటనే పశుపోషణ కూడా ఉంటుంది. గతంలో పశుసంపదను బట్టి రైతు ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేవారు. సీమాంధ్ర పాలకులు చెరువులు, కుంటలను విస్మరించడంతో ఎండిపోయి నీటి కొరత ఏర్పడింది. పరిమిత వ్యవసాయం, పశుపోషణ భారంగా మారడంతో రైతులు వాటిని అమ్ముకొని వలసబాట పట్టారు. ఈ నేపథ్యంలో రెండేండ్లుగా కాళేశ్వరం జలాల రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వేసవి వెళ్లిపోయి వానకాలం వచ్చినట్లుగా వ్యవసాయం చిగురించింది. మత్స్యసంపదతో పాటు పశుసంపద గణనీయంగా పెరుగుతున్నది. గొర్రెలు, బర్రెల సంఖ్య రెట్టింపు కాగా, మేకలు, పాడి పశువులు, కోళ్ల సందడి నెలకొంది. వెరసి వ్యవసాయ క్షేత్రాలు, పాడిపంటలు కనువిందు చేస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలో పశు సంపద వృద్ధి ఇలా
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2019లో పశుగణన జరిగింది. ఈ లెక్కన జిల్లాలో ఆవులు, ఎద్దులు 1,03,616, బర్రెలు 3,18,634, గొర్రెలు 8,21,941, మేకలు 19,92,897, కోళ్లు 1,45,252 ఉన్నాయి. మత్స్యసంపద అంచనాలను మించిపోయింది. ఇతర జంతువుల సంఖ్య కూడ గణనీయంగా పెరిగింది. ఐదేళ్లకోసారి పశువుల సర్వే నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
పశువులకు సైతం హెల్త్ప్రొఫైల్…
తెలంగాణ ప్రభుత్వం పశువులకు సైతం ఆధార్ తరహా నంబర్ (యూనిక్ ఐడీ)ని కేటాయించింది. తద్వారా పశువుల హెల్త్ప్రొఫైల్ నమోదు చేస్తూ అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నది. 1962టోల్ ఫ్రీ నంబర్ కేటాయించి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి వైద్య బృందాన్ని గ్రామాలకే పంపిస్తున్నది. పశువులకు సకాలంలో టీకాలు, బర్రెలకు సైతం తొలిసారిగా నట్టల నివారణ మందు పంపిణీ, కృత్రిమ గర్భధారణ వ్యాక్సినేషన్ అందిస్తున్నది. గొర్రెలు, మేకలకు సైతం సందర్భానుసారం టీకాలు, మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నది.
పశువులు లేకుంటే ఎవుసం చేసే పరిస్థితి లేదు
ఎనకట ఒక్క కండెం (కోల) పది ఫీట్ల తోతులోనే నీళ్లు ఉండేవి. ఇప్పుడు కేసీఆర్ సారు ఎనకటి రోజులు మరిపించిండు. ఎక్కడ చెలమలు తీసినా నీళ్లు వస్తున్నయి. మేము మూడు జతల పశువులు కొని 30 సంవత్సరాల తర్వాత పడావు పడిన చెల్కను పశువులతో అచ్చుకట్టి సాగు చేసినం. ఇప్పుడు ఎక్కడ చూసినా రైతులు పశువులు కొంటున్నారు. బావుల కాడ ఎనకటి లాగా పశువుల కొట్టాలు, గడ్డివాములు వెలుస్తున్నయి. పశువులకు మేత భయం లేదు.
-గుగులోతు దల్పా, మామిడాల
గ్రామాల్లో గత వైభవం కనిపిస్తున్నది..
రాష్ట్ర ప్రభుత్వం సాగునీళ్లతో పాటు వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేస్తున్నది. ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇస్తుండడంతో వలసలకు అడ్డుకట్ట పడి సన్నకారు రైతులు వ్యవసాయంపై దృష్టిసారించారు. పశువులు, బర్రెలు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నరు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పశుసంపద గత వైభవాన్ని గుర్తు చేస్తున్నది.
కేసీఆర్ సారు ఎనకటి కాలం తెచ్చిండు
గతంలో మేత లేక పశువులను కోతకు అమ్మినం. మల్ల పాతరోజలు వస్తాయా అనుకున్నం. ఇప్పుడు కేసీఆర్ సారు ఎనకటి కాలం తెచ్చిండు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లున్నయ్. పశువులు, గొర్రెలు, మేకలకు పచ్చగడ్డి దొరుకుతుంది.
ఎద్దులు, బర్రెలు కొన్నా..
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే వ్యవసాయం పండుగలా మారింది. లక్షాయాభైవేలు ఖర్చుపెట్టి బోరు పైపులైన్ వేసుకున్నా. పశువుల జత, బర్రె, ఎడ్ల బండి కొన్నా. గతంలో నీళ్లులేక వ్యవసాయంపై విరక్తి ఉండేది. తెలంగాణ సర్కారు చెరువులను బాగుచేయించడంతో నీళ్ల కొరత తీరిపోయింది. భూగర్భ జల పెరిగి బోర్లు బాగా పోస్తున్నయి. నాకున్న నాలుగు ఎకరాల్లో పత్తి, కూరగాయలు, వరి సాగు చేస్తున్నా.
తొండ గ్రామంలో పెరిగిన పశుసంపద ఇలా..
తిరుమలగిరి మండల పరిధిలో 16గ్రామ పంచాయతీలు ఉండగా తొండ గ్రామంలో పశుసంపద ఎంతో వృద్ధి చెందింది. వలసలకు వెళ్లిన వారు సైతం తమకు ఉన్న భూమిలో సాగు చేసుకుంటూ పశువులను, గేదెలను కొనుగోలు చేస్తుండడం విశేషం.
పశువులు
2012-13
120
2019-20
160
కోళ్లు
2012-13
3566
2019-20
9442
బర్రెలు
2012-13
230
2019-20
502
మేకలు
2012-13
102
2019-20
146
గొర్రెలు
2012-13
3054
2019-20
7559