బోయినపల్లి వినోద్కు ఐక్యవేదిక విజ్ఞప్తి
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని హెల్త్కేర్ వర్కర్ల ఇంట్లో వారందరికీ టీకాలు వేయాలని హెల్త్కేర్ వర్కర్ల ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు వినతిపత్రం అందజేసింది. కొవిడ్ విధుల్లో ఉండి చనిపోయినవారికి నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి అర్హతకు తగిన ఉద్యోగం ఇప్పించాలని కోరింది. వైద్యులు, వైద్య సిబ్బందికి ఇంతకుముందు ఇచ్చినట్టుగా 10 శాతం కొవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని, షిప్టులవారీగా డ్యూటీలు వేసి పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తిచేసింది. 30న క్యాబినెట్ సమావేశంలో ఈ విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించింది. వినోద్కుమార్ను కలిసినవారిలో హెల్త్కేర్ వర్కర్ల ఐక్యవేదిక నాయకులు డాక్టర్ రవిశంకర్, డాక్టర్ కత్తి జనార్దన్, ఆర్సుజాత, వీరారెడ్డి, మంచాల రవీందర్, ఏ సుజాత తదితరులు ఉన్నారు.
దివ్యాంగులకు వారి ఇంటివద్దే వ్యాక్సిన్ ఇవ్వాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు కోరారు. రాష్ట్రంలో చాలా మంది దివ్యాంగులు కరోనాతో బాధపడుతున్నారని, అలాంటివారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన శుక్రవారం ప్రభుత్వానికి లేఖరాశారు.
రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన తల్లిదండ్రుల పిల్లలు అనాథలుగా మారుతున్నారని, అలాంటి వారిని ప్రభుత్వం పెద్దమనసుతో చేరదీసి ఆదుకోవాలని రాష్ట్ర ఎంబీసీ కులాల కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు శుక్రవారం లేఖరాశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలుచేస్తూ దేశానికే దిక్చూచిగా మారిన సీఎం కేసీఆర్.. అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవటానికి వినూత్న పథకాన్ని తీసుకురావాలని కోరారు.