రోమ్: పెళ్లైన ఏడాదిన్నర తర్వత రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన మహిళ (Woman In Coma) 31 ఏళ్ల తర్వాత మరణించింది. ఆమె జీవిస్తుందని ఇంత కాలం నమ్మకంతో ఉన్న భర్త ఆశలు ఆవిరయ్యాయి. ఈ విషాద ప్రేమ కథ ఇటలీలో జరిగింది. వెనెటో ప్రాంతానికి చెందిన మిరియం విసింటిన్కు ఒక డిస్కోలో ఏంజెలో ఫరీనాతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం ప్రేమలో ఉన్న వారిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ దంపతుల అన్యోన్యత చూసి విధికి అసూయపుట్టింది. 1991 డిసెంబర్లో క్రిస్మస్ సాయంత్రం వేళ ఆమె నడుపుతున్న కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. మెదడుకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లింది.
కాగా, మిరియం విసింటిన్ బతికే అవకాశాలు లేవని ప్రమాదం జరిగిన రోజునే 33 ఏళ్ల భర్త ఏంజెలో ఫరీనాకు వైద్యులు తెలిపారు. అయితే తన భార్య బతుకుతుందని అతడు చాలా నమ్మకంతో ఉన్నాడు. భార్య కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని పెళ్లి నాడు చేసిన ప్రమాణానికి కట్టుబడ్డాడు. కోమాలో ఉన్న భార్యను కేర్ సెంటర్లో ఉంచి ఏళ్లుగా వైద్యం అందిస్తున్నాడు. ప్రతి రోజూ ఆఫీస్ లంచ్ సమయంలో అక్కడకు వెళ్లి భార్యను చూసేవాడు. కొన్నిసార్లు సాయంత్రం వేళల్లో ఆమె వద్ద ఉండేవాడు.
మరోవైపు 31 ఏళ్లుగా కోమాలో ఉన్న మిరియం విసింటిన్ ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు రెండు నెలల కిందట వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం శాన్ బాస్సియానోలోని హాస్పిటల్కు ఆమెను తరలించారు. అయితే ఈ నెల 10న ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న భర్త ఏంజెలో ఫరీనా తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. చివరకు ఆమెకు శాంతి చేకూరిందని, ఆమె స్వర్గానికి చేరడంపై తనకు సంతోషంగా ఉందని తెలిపాడు.
తామిద్దరం కలిసి ఎన్నో చేయాలని కలలు కన్నట్లు ఏంజెలో ఫరీనా చెప్పాడు. అయితే పెళ్లైన ఏడాదిన్నర తర్వాత యువ దంపతులమైన తమ పట్ల విధి క్రూరంగా ప్రవర్తించిందని వాపోయాడు. తన భార్యకు ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ శనివారం ఆమె అంత్యక్రియల సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు.