వాషింగ్టన్: ఆఫ్ఘనిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి సమర్థించుకున్నారు. అది సరైన నిర్ణయమని, తెలివైనది, అమెరికాకు ఉత్తమమైనదని స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ అనంతరం బైడెన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ముగింపుపలుకుతూ.. లక్షా 20 వేల మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పారు.
దేశ ప్రజలు, మిలటరీ సలహాదారులు, యుద్ధభూమిలో ఉన్న సర్వీస్ చీఫ్లు, కమాండర్ల ఏకగ్రీవ సిఫారసుతోనే ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆఫ్ఘన్లో యుద్ధం ముగిసింది. 20 ఏండ్లుగా జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలనే సమస్యను ఎదుర్కొన్న నాలుగో అధ్యక్షుడినని తెలిపారు.
బలగాల తరలింపుపై అమెరికన్లకు తాను హామీ ఇచ్చానని, ఇప్పుడు దానిని నిలబెట్టుకున్నానని వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్తోపాటు ఇతర దేశాల్లో కూడా టెర్రరిజంపై అమెరికా పోరు కొనసాగుతుందని, అయితే అక్కడ అడుగుపెట్టకుండా ఈ పోరును కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
‘దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా లక్షా 20 వేల మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించాం. ఇలాంటిది మరే దేశమూ చేయలేదు. ఇది అమెరికాకు మాత్రమే సాధ్యం. అది మేము చేసి చూపించాం. మిలిటరీ తరలింపు ఓ అద్భుత విజయం. ఈ మిషన్ విజయానికి కారణం అమెరికా మిలిటరీ విభాగం. వారి నైపుణ్యాలు, వీరత్వానికి ఈ విజయం నిదర్శనమని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి 90 శాతం అమెరిన్లను తరలించామని, మిగిలినవారిని కూడా తీసుకొస్తామని చెప్పారు. వారి తరలింపునకు ఎలాంటి డెడ్లైన్ లేదు’ అని బైడెన్ స్పష్టం చేశారు.