కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఓ ఆఫర్తో ముందుకు వచ్చింది. ఇప్పటికే మూడింట రెండు వంతుల ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమించేశారు. తాజాగా గురువారం ఘజినీ నగరం కూడా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఈ హింసను ఆపితే.. ప్రభుత్వంలో మీకూ వాటా ఇస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. తాలిబన్ తిరుగుబాటుదారులు మెల్లగా రాజధాని కాబూల్ దగ్గరికి వస్తుండటంతో ప్రభుత్వం ఇలా స్నేహ హస్తాన్ని చాచింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోతుండటంతో అక్కడ మరోసారి తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్నారు.
ఈ నెల చివరిలోగా అమెరికా దళాల్లో చివరిది ఆఫ్ఘనిస్థాన్ను వీడనుంది. ఇదే అదును తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తోంది. వాళ్లను ఎదుర్కోవడం ఆఫ్ఘన్ సాయుధ బలగాల వల్ల కావడం లేదు. ఇప్పటికే రాజధాని కాబూల్, మరో ప్రధాన నగరం కాందహార్ మధ్య హైవేపై ఉన్న ఘజినీ నగరం కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కాందహార్లోనూ రెండు వర్గాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే అక్కడి ప్రావిన్సియల్ జైలును స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు.