కీవ్, మార్చి 3: ఉక్రెయిన్లో తాము అనుకొన్నది సాధించి తీరుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కు తగ్గబోమన్నారు. గురువారం ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఫోన్లో మాట్లాడారు. ఆ వివరాలను రష్యా అధ్యక్ష భవనం విడుదల చేసింది. ‘ఉక్రెయిన్లో నిస్సైనికీకరణ. తటస్థ దేశంగా మార్చడం మా లక్ష్యం’ అని పుతిన్ మాక్రాన్తో చెప్పినట్టు పేర్కొన్నది. శాంతి చర్చలపై ఉక్రెయిన్ ఏ మాత్రం ఆలస్యం చేసినా తమ డిమాండ్ల జాబితా పెరుగుతుందని పుతిన్ హెచ్చరించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో విడుత చర్చలు గురువారం రాత్రి బెలారస్లో జరిగాయి.
ఖార్కీవ్లో విధ్వంసం
ఉక్రెయిన్లో రష్యా రోజురోజుకు దాడులను తీవ్రతరం చేస్తున్నది. కీలకమైన తీరప్రాంత నగరం ఖేర్సన్ గురువారం రష్యా చేతికి చిక్కింది. చెర్నిహివ్లో భీకర దాడులను జరిపిన రష్యా సేనలు ఈ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకొన్నట్టు ప్రకటించాయి. ఈ దాడుల్లో 22 మంది పౌరులు మరణించారు. గురువారం ఖార్కీవ్లో జరిగిన దాడుల్లో 34 మంది చనిపోయారు. కీవ్లోని రెండు రైల్వే స్టేషన్లలో భారీ పేలుళ్లు సంభవించాయి. మరియూపూల్లో భారీ ఎత్తున బాంబు దాడులు జరిగాయి. బారెంట్స్ సముద్ర జలాల నుంచి అణుజలాంతర్గాములను రష్యా తరలిస్తున్నది. ఇదిలా ఉండగా, కీవ్ వైపు వస్తున్న రష్యా భారీ ఆయుధ కాన్వాయ్ ఇంధనం, ఆహార సరఫరా లేక 24 గంటలుగా నిలిచిపోయినట్టు అమెరికా తెలిపింది. దేశంలోని రష్యా ప్రభుత్వ, పౌరుల ఆస్తులను సీజ్ చేసే చట్టానికి ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ దాడుల్లో రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్స్స్కీ మరణించినట్టు సమాచారం.
15 రోజుల రష్యా ‘ప్లాన్’
ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా వేసిన రహస్య ప్రణాళికలు బహిర్గతమయ్యాయి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6వ తేదీలోపు 15 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేయాలని ఒక యూనిట్కు ఆదేశాలు అందాయి. జనవరి 18న ఆపరేషన్కు హైకమాండ్ ఆమోదం లభించినట్టు తెలిసింది.